సీఎం మనవడు గోళీలు ఆడుకోవడానికి 'టీ' సచివాలయం వేదికగా: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామానలు చూస్తుంటే బాధేస్తోందని తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లోకి నలుగురు టీటీడీపీ ఎమ్మెల్యేలు చేరడంపై రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద టీఆర్ఎస్లో చేరడంతో అక్కడ పార్టీ ఇన్చార్జ్ను నియమించే విషయంపై శనివారం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా ఇన్చార్జ్ను నియమిస్తామని ఆయన చెప్పారు.
అధికార పార్టీ టీఆర్ఎస్పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే మనుషులపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. జంతువులకు ఉన్న విశ్వాసం కూడా ఎమ్మెల్యేలకు లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు.
పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను చూస్తుంటే అసహ్యం వేస్తోందని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కష్టాలు వచ్చినప్పుడు నిలబడి కలబడిన వాడే మగాడన్నారు. కేసీఆర్ ఆడుతున్న రాజకీయ క్రీడలో ఆయనే బలవక తప్పదని జోస్యం చెప్పారు.
ప్రభుత్వ పనితీరుపై కోదండరాం, చుక్కారామయ్య ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.సీఎం మనవడు గోళీలు ఆడుకునేందుకు తెలంగాణ సచివాలయం వేదికగా మారిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈరోజు కేసీఆర్కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు రేపు హరీశ్రావుకు అమ్ముడుపోతారన్నారు. 2019 ఎన్నికల్లో వంద నియోజకవర్గాల్లో కొత్తవారిని తీసుకొస్తామన్న చెప్పిన రేవంత్ రెడ్డి, 50 శాతం సీట్లను బీసీలకే కేటాయిస్తామన్నారు.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు శుక్రవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో హల్ చల్ చేశాడు. సీఎం వాహనంలో వచ్చిన హిమాన్షు ఆరో అంతస్థులో సీఎం కార్యాలయం, మంత్రివర్గ సమావేశం జరిగే గదులను పరిశీలించాడు.
తాత ఎక్కడ కూర్చుంటారు? మంత్రి వర్గ సమావేశం ఎక్కడ జరుగుతుంది వంటి వివరాలు ఆరా తీశాడు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యనటలో ఉండగా కేటీఆర్ తనయుడు హిమాన్షు సచివాలయానికి రావడం విశేషం.
హిమాన్షు వెంట నిజామాబాద్ ఎంపీ కవిత పిల్లలు కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత తొలిసారిగా హిమాన్షు సచివాలయానికి శుక్రవారం వచ్చాడు.