టీవీల్లో, న్యూస్లో చూశారు కదా: జైలు అధికారులతో రేవంత్ రెడ్డి
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం జైలు అధికారులతో ముక్తసరిగా మాట్లాడినట్లు తెలిసింది. కూతురు నైమిశా రెడ్డి నిశ్చితార్థం ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వచ్చిన రేవంత్ రెడ్డి జైలు అధికారులతో పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలేదని అంటున్నారు.
మీ కూతురు నిశ్చితార్థం ఎలా జరిగిందని జైలు అధికారులు అడిగితే టీవీల్లో, న్యూస్లో చూశారు కాదా.. ఏముంది చెప్పడానికి అని ఆయన అన్నట్లు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి. జైలుకు తిరిగి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా మౌనంగా ఉన్నారని జైలు అధికారులు చెప్పారు.
కూతురు నిశ్చితార్థానికి హాజరు కావడానికి ఎసిబి ప్రత్యేక కోర్టు రేవంత్ రెడ్డికి గురువారం 12 గంటలపాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన కూతురు నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొని తిరిగి గడువు కన్నా ముందే జైలుకు వచ్చేశారు.
గురువారం సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ 4 గంటలకే ఆయన జైలుకు బయలుదేరి వచ్చారు. రేవంత్ రెడ్డి జైలుకు చేరుకునే సరికి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల సమయం అయింది. పూర్తి స్థాయి బెయిల్ పొందడానికి వీలుగానే రేవంత్ రెడ్డి తాత్కాలి బెయిల్ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.