రేవంత్ ఇక్కడ, మనసు సీమాంధ్రపై: టీఆర్ఎస్, బాబు ఉన్మాది: గౌడ్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి కొడంగల్కు ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన మనసంతా కోనసీమ చుట్టే తిరుగుతోందని, ఆయన ఆంధ్ర పెట్టుబడిదారుల పక్షాన వకల్తా పుచ్చుకుంటున్నారని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ శాసన సభ్యులు ఆరోపించారు.
టీఆర్ఎస్ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ రాములు నాయక్లు శనివారం రేవంత్ పైన మండిపడ్డారు. తెలంగాణలో ఉంటూ ఇక్కడి ప్రాంతానికి ద్రోహం చేస్తున్న వ్యక్తి రేవంత్ అన్నారు.
పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ శక్తివంచన లేకుండా కష్టపడుతుంటే, దానిని అడ్డుకొనేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు బానిసలుగా ఉన్న ఈ ప్రాంత టీడీపీ నేతలు ఆయనకు వత్తాసు పలుకుతున్నారన్నారు.
పాలమూరు గడ్డ మీద పుట్టి జిల్లా ప్రజల ఓట్లతో ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు సిగ్గు శరం లేకుండా జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. జిల్లా ప్రజల నోటికాడి బుక్కను గుంజుకుంటే టీడీపీ పుట్టగతులు లేకుండా పోతుందన్నారు.
అసలు రేవంత్కు జిల్లాలో గానీ, రాష్ట్రంలోగానీ జీవించే హక్కు లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలమూరు పథకాన్ని పూర్తిచేయాలనే కృత నిశ్చయంతో ఉండగా, చంద్రబాబు దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. 2013లోనే జీవో ఇచ్చిన పాలమూరు అక్రమమైతే, పట్టిసీమ ప్రాజెక్టు సక్రమమా? అని ప్రశ్నించారు.
రేవంత్ను చూసి తెలంగాణ తల్లి రోధిస్తున్నదని, ఇలాంటి దుర్మార్గుడు నా గడ్డ మీద పుట్టిండా అని బాధపడుతుందన్నారు. తెలంగాణలో ఉంటూ ఈ ప్రాంతానికే ద్రోహం తలపెడుతున్న కోవర్టు రేవంత్ అని, ఒక ఐఎస్ఐ ఏజెంటులాంటివాడని మండిపడ్డారు.
చంద్రబాబుపై శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
చంద్రబాబు ఓ ఉన్నాది, శాడిస్టులా వ్యవహరిస్తున్నారని టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వీ శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. సెక్షన్- 8పై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణమని అన్నారు. సీఎంగా ఎన్నో ఏండ్ల అనుభవమున్న చంద్రబాబుకు చట్టాలు తెలియకపోవడం బాధాకరమన్నారు.
సెక్షన్-8ని అమలు చేయాలని లేఖ రాసి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారన్నారు. హైదరాబాద్లో అల్లకల్లోలం జరిగి ఆస్తుల నష్టం జరిగినప్పుడు మాత్రమే సెక్షన్-8 అమలు చేయాలని విభజన చట్టంలోని 3, 4 క్లాజ్లో స్పష్టంగా పేర్కొన్నారనే అంశాన్ని గుర్తు చేశారు.