తాగుబోతుల్ని తయారు చేస్తావా: కెసిఆర్పై రేవంత్, తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం
మహబూబ్ నగర్/అదిలాబాద్: గ్రామాల్లో బీరు, బార్లకు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు.. బంగారు తెలంగాణ అంటే తాగుబోతులను తయారు చేయడమా అని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఆయన మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అంగన్వాడీ, ఒప్పంద ఉద్యోగుల సమ్మెతో పరిపాలన కుంటుపడిందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెస్ బిల్లులు రూ.7 కోట్లు చెల్లించక మూతబడ్డాయన్నారు.
ఓ వైపు బిల్లులు చెల్లించక మెస్ మూతబడుతుంటే రూ.5 కోట్లతో సిఎం కొత్త కార్లు కొనుగోలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవని నిరంజన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
రెండుసార్లు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదన్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఇంటిని ప్రభుత్వం కొనుగోలు చేసి స్మారక కేంద్రంగా మార్చాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి దస్త్రం ముఖ్యమంత్రి వద్ద పెండింగులో ఉందని, మంజూరు చేయాలని కోరినా స్పందించడం లేదన్నారు.
అదిలాబాద్ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం
అదిలాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జిల్లాలోని దండేపల్లిలో గురువారం అర్ధరాత్రి ఇది చోటుచేసుకుంది.
విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు దండేపల్లి బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగప్రవేశం చేసిన పోలీసులు, దుండగులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు.