చేదు అనుభవం: బైక్పై పారిపోయిన రేవంత్.., అరెస్టుకు డిమాండ్!
నందిగామ: కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూర్ మండలం, నందిగామ ప్రజలు ఆయనపై తిరగబడ్డారు. గ్రామంలోని ఓ శిలాఫలాకాన్ని అనుచరులతో కలిసి ధ్వంసం చేసినందుకే ఈ ఘటన జరిగినట్టు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. నందిగామ గ్రామంలోని ఓ శిలా ఫలకాన్ని రేవంత్ రెడ్డి తన వాహనంతో ఢీకొట్టారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన శిలాఫలాకాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి తీరుపై భగ్గుమన్న గ్రామస్తులు ఆయన్ను నిలదీసేందుకు వాహనం వెంటపడ్డారు. ఆయన కారుకు అడ్డుపడి దీనిపై సమాధానం చెప్పాల్సిందేనని నిలదీశారు. గ్రామస్తులు వెనక్కి తగ్గేలా లేరని గ్రహించిన రేవంత్.. బైక్ పై మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు.
అయితే రేవంత్ పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు మాత్రం రహదారిని దిగ్బంధించారు. తక్షణమే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసులు రేవంత్ రెడ్డికే వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు దీనిపై ఫిర్యాదు చేశారు.