గజ్వేల్ లో ఒంటేరును గెలిపించేందుకు రేవంత్ వ్యూహాలు ఫలిస్తాయా..? కేసీఆర్ ప్రతి వ్యూహం ఏంటి..?
హైదరాబాద్ : తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు వ్యూహాలకు పదును పెంచుకుంటున్నారు నేతలు. ఎన్నికల శంఖారావం మొదలైన దగ్గరనుండి గెలుపుకోసం, ప్రత్యర్థుల బలం, బలహీనతలమీద నేతలు ద్రుష్టి సారించరు. బలమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓడించేందుకు ఆపథర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రణాళికలు రచిస్తుంటే గజ్వేల్ లో కేసీఆర్ నే ఓడించేందుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించడమే కాకుండా ప్రత్యర్థి చంద్రశేఖర్ రావును ఓటమి పాలు చేసేందుకు రేవంత్ రెడ్డి తనదైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకం గజ్వేల్..! కేసీఆర్ గెలుస్తాడా..!రంగంలోకి రేవంత్..!!
టీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మక నియోజకవర్గాల్లో గజ్వేల్ ఒకటి. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండే ఈ నియోజకవర్గం నుంచే గులాబీ దళపతి కేసీఆర్ గత ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ దఫా కూడా అక్కడి నుంచే బరిలో దిగడం దాదాపు ఖాయం. అయితే, గతంలో మాదిరిగా గజ్వేల్లో ఆయన విజయం నల్లేరుపై నడక కాదని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన పరాజయం పాలయ్యే అవకాశాలూ తక్కువేమీ కాదని వారు చెబుతున్నారు. కేసీఆర్తో ఢీ అంటే ఢీ అనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్న ఓ బ్రహ్మాస్త్రమే ఇందుకు ప్రధాన కారణమని సూచిస్తున్నారు.
ఒంటేరును గెలిపించేందుకు రేవంత్ వ్యూహాలు..! గజ్వేల్ లో గట్టెక్కేనా..?
రేవంత్ రెడ్డి సంధిస్తున్న ఆ బ్రహ్మాస్త్రం పేరు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. రేవంత్కు ఆయన అత్యంత సన్నిహితుడు. ప్రజల్లో మంచి పేరు ఉన్నవాడు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి.. కేసీఆర్ చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత తన మిత్రుడు రేవంత్తో కలిసి కాంగ్రెస్లో చేరాడు. ఈ సారి కూడా గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో.. ఆయనకు ఇరు పార్టీల అండ దొరికినట్లవుతోంది. అంతేకాదు, కేసీఆర్ కక్ష సాధించి ప్రతాప్ రెడ్డిని జైల్లో పెట్టించాడనే సానుభూతి కూడా గజ్వేల్ జనాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి కేసీఆర్ను ఆయన మట్టి కరిపించడం ఖాయమని పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.
ఒంటేరు బలం..! రేవంత్ వ్యూహం..!! గులాబీ బాస్ కి చుక్కలే..!!
నిజానికి 2014 ఎన్నికల్లో గజ్వేల్లో కేసీఆర్ అంత సులువుగా విజయం సాధించలేదు. గత ఎన్నికల్లో ఆయనకు 86 వేల ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న ఒంటేరు అప్పట్లో టీడీపీ లో ఉన్నప్పుడు 67 వేల ఓట్లు, కాంగ్రెస్కు 36 వేల ఓట్లు లభించాయి. ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ జత కట్టాయి. రెండు పార్టీల ఓట్లను కలిపి చూస్తే.. కేసీఆర్ కంటే దాదాపు 20 వేల ఓట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రకారం చూస్తే ఈసారి గజ్వేల్లో ఒంటేరు విజయ దుందుభి మోగించడం ఖాయమన్నది కొందరి వాదన.
కేసీఆర్ పై వ్యతిరేకత..! రేవంత్ పై సానుకూలత..! బయటపడనున్న ఒంటేరు..!!
ఇక్కడ గమనించాల్సిన మరో కీలక విషయం ఏంటంటే.. గజ్వేల్లో మాదిగల ఓట్లు పాతిక వేలకుపైగానే ఉన్నాయి. రెడ్ల ఓట్లు దాదాపు 30 వేలు. అవన్నీ ఒంటేరుకే పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. తమ నియోజకవర్గానికి ఆయన పెద్దగా చేసిందేమీ లేదని గజ్వేల్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కూడా సూచిస్తున్నారు. స్వయంగా కేసీఆర్ అనుచరుల్లో చాలామంది ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక రేవంత్ రెడ్డి కూడా ఒంటేరు గెలుపు కోసం తనదైన శైలిలో ప్రణాళికలు రచించడం ఖాయమే. కాబట్టి ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని విశ్లేషణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గజ్వేల్ లో మంచి పట్టున్న ఒంటేరుకి, రేవంత్ రెడ్డి లాంటి సమర్థవంతమైన వ్యూహకర్త తోడైతే ప్రత్యర్థి ఎంతటి వాడైనా పలాయనం చిత్తగించాల్సిందేననే చర్చ జరుగుతోంది..