"కేసీఆర్ 2029 లో చూస్కుందాం నువ్వో నేనో"
రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా నస్తూరుపల్లి సభ వేదికగా రూ. 5,563 కోట్లు విడుదల చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. నిధుల విడుదల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ.. దేశంలోనే రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.
" రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించాం. 22.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ. 22 వేల కోట్లు వేశాం. గత విడతలో రైతు భరోసా కింద 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు జమ చేశాం. మిగతా రూ. 3,300 కోట్లు వచ్చే నెలలో రైతుల ఖాతాలో వేస్తాం. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా..? రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
" ప్రజాపాలన పోవాలి.. పాపాల భైరవుడు రావాలని ఓ పెద్ద మనిషి అంటున్నాడు. ఫామ్ హౌజ్ లో పడుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలి. లక్షలాది మంది కార్యకర్తలు రక్తాన్ని చమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా జెండా మోస్తే ప్రభుత్వం వచ్చింది. పాపాల భైరవుడు ఎందుకు రావాలో.. పార్టీ మారుతున్న పెద్ద మనిషి చెప్పాలి. జీవన్ రెడ్డి చరిత్ర.. ఆయన వెనకున్న మచ్చలు నాకు తెలుసు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల వెంట పోయారు. 40 ఏళ్ల పాటు తన కుటుంబానికి పదవులు ఇచ్చుకున్నారు. 14సార్లు కాంగ్రెస్ బీఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్లిపోయారు" అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

"పదేళ్ల పాలనలో బిడ్డ, కొడుకు, తండ్రి ఇలా తలా ఓ ఫామ్ హౌజ్ నిర్మించుకున్నారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా..? 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ప్రజా పాలన పోవాలా..? వరి వేస్తే ఉరి.. అని పంటని కొనేదే లేదన్న నేత మళ్లీ రావాలా..? వాస్తు బాగాలేదని చెప్పి దాన్ని కూల్చి కొత్తగా కట్టుకున్నారు. పేదలు కట్టుకోవడానికి పనికి రాని బతుకమ్మ చీరలను పంచారు. ఒక్కాయనకు పదవి రాకపోతే ప్రజా పాలన పోవాలా..?" అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 2029 లో కేసీఆర్ నువ్వో నేనో చూస్కుందాం.. అని సవాల్ విసిరారు.
" 2029 ఎన్నికల్లో తేల్చుకుందాం.. దమ్ముంటే రండి అంటూ బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ సవాల్ చేశారు. కేసీఆర్ కు ఉన్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. 'దేశంలోనే అత్యధిక మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తామని. ఇక్కడ 15మంది ఎంపీలను గెలిపించి రాహుల్ను ప్రధానిని చేద్దాం' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'తోడేలు బయటకెళ్లింది. తోడేలు గుండెలు అదరాలి' అని కేసీఆర్ ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications