ఘోర ప్రమాదం: కారు-ఆటో ఢీ, ఐదుగురు సజీవ దహనం
కరీంనగర్: జిల్లాలోని రామగుండం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన పొట్యాల వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికి అక్కడే మంటల్లో సజీవ దహనమయ్యారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద ధాటికి ఆటోలో ఉన్న పెట్రోలు డబ్బా(క్యాన్) పగలడంతో మంటలు వ్యాపించి కారు, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దహనమయ్యారు.
మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన అమ్జద్పాషా, జంగిలి రాజు, మోహన్, గాజరవేణి రాజేందర్, హరీష్ కారులో రామగుండం మండలం కుక్కలగూడురులోని తమ మిత్రుని కూతురు బారసాల కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం తిరిగి బెల్లంపల్లికి బయలుదేరారు. అయితే మోహన్ను వదిలేసి నలుగురు మాత్రమే కారులో బయలుదేరారు.
వెనుకాలే మోహన్ ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. పొట్యాల గ్రామ సమీపంలోకి కారు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటో ఒక్కసారిగా ఢీకొంది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న మోహన్ కూడా కారును వెనుక నుంచి ఢీకొన్నాడు.
ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న డబ్బా నుంచి పెట్రోలు బయటకు చిమ్మడంతో పాటు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న అమ్జద్పాషాతో పాటు సోమన్పల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఉప్పులేటి రాజేందర్, పొట్యాలకు చెందిన ప్రయాణికులు మధనమ్మ, బూదమ్మ అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు.
తీవ్రంగా గాయపడ్డ పొట్యాలకు చెందిన ప్రయాణికుడు ఇమ్రాన్ఖాన్ను కరీంనగర్ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో దుర్మరణం పాలయ్యారు. జంగిలి రాజు, మోహన్, గాజరవేణి రాజేందర్, హరీష్, ఆటోలోని ప్రయాణికుడు ఉప్పులేటి లక్ష్మయ్య తీవ్రంగా గాయపడ్డారు.