ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు చిన్నారులతో సహా సర్పంచ్ కుటుంబం దుర్మరణం
నల్గొండ: జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం దుర్మరణం పాలైంది. లారీ బీభత్సంతో ఒకే కుటుంబంలో భార్య, భర్త, వారి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన స్థలం బీతావాహంగా మారింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ నుంచి బియ్యం లోడుతో వస్తున్న ఓ లారీ నిడమనూరు వద్ద ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం పక్కకు పడిపోయింది. అదే సమయంలో వెనకే వస్తున్న ద్విచక్ర వాహనంపైకి టాటా ఏస్ వాహనం దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న తెప్పలమడుగు గ్రామ సర్పంచ్ తరి శ్రీనివాస్(34), అతడి భార్య విజయ (30), అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటే ఉన్న కుమార్తె శ్రీవిద్య (5), కుమారుడు కన్నయ్య (3)కు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే చిన్నారులు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఇక టాటా ఏస్ వాహనంలో ఉన్నవారిలో ముగ్గురు గాయపడగా వారికి మిర్యాలగూడలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు, హాలియా సీఐ మీరా రాఘవులు, స్థానిక ఎస్సై కొండల్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు.
ముప్పవరంలోని విజయ పుట్టింట్లో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ కుటుంబం మృతితో వారి స్వగ్రామం తెప్పలమడుగులో విషాద ఛాయలు అలుముకున్నాయి.