TGSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు..!
బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీకి సహకరించాలని పోలీస్, రవాణా శాఖల అధికారులను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. గత దసరాతో పోల్చితే ఈ సారి మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందన్నారు. అందుకే గతంలో మాదిరిగానే సహాయసహకారాలు అందించాలన్నారు.
దసరా ఆపరేషన్స్ కు సంబంధించి హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం వీసీ సజ్జనర్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దసరాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు ఆర్టీసీ అధికారులు.
పండుగ సమయాల్లో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీకి పోలీస్, రవాణా శాఖలు ఎంతగానో సహకరిస్తున్నాయని సజ్జనార్ గుర్తు చేశారు.

సంస్థ వృద్దిలో పోలీస్, రవాణా శాఖల పాత్ర కూడా ఉందని కొనియాడారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని ప్రజలకు సూచించారు. టీజీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని.. వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని వివరించారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే తలెత్తే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం చేసిందన సజ్జనార్ గుర్తు చేశారు. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడుపుతోన్నట్లు వివరించారు. ఈ నెల 9 నుంచి 12 తేది వరకు అధిక రద్దీ ఉండే అవకాశం ఉందని.. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో తీసుకొస్తామని అన్నారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంనచా వేశారు.












Click it and Unblock the Notifications