బాహుబలి అన్నారు..! బగాయిస్తామన్నారు..! మనుగడే భారంగా మారిన టీ కాంగ్రెస్ పరిస్థితి..!!
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఓ బాహుబలి వస్తున్నాడు.. అదికార పార్టీని బాగాయించడమే ఆలస్యం.. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి మంచి వేవ్ క్రియేట్ అయ్యింది. అదికారంలోకి రావడం ఖాయం.. ఇవి ముందస్తు ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు. ఎక్కడకు వెళ్లినా.. ఏ నేతను కదిలించినా ఇవే వ్యాఖ్యలు.. కాని కొన్ని నిజాలను కాలం నిరూపిస్తుందంటారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో అచ్చం ఇదే జరిగింది. శాసన సభ ఎన్నికల్లో ఘోరపరాజయం.. గెలిచిన కాస్తో కూస్తో ఎమ్మెల్యేలు అదికార పార్టీలోకి మారిపోవడం., ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు కూడా దూరమయ్యే పరిస్థితులను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంది. పార్టీ ఇంత అధ:పాతాళానికి ఎందుకు వెళ్తోంది.. నేతల మద్య ఏకాభిప్రాయం తీసుకొచ్చే సామర్థత ప్రస్తుత నాయకత్వానికి లేదా.. తెలుసుకుందాం..!
తెలంగాణలో కాంగ్రెస్ విచిత్ర పరిస్థితి..! గెలిచినా గెలవనట్టే..!!
ఐదారు దశాబ్దాల నుంచి పట్టు కోల్పోకుండా వస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో మరింతగా పట్టు కోల్పోయే ప్రమాదం కన్పిస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినప్పటికీ ఆ పార్టీని తెలంగాణ ప్రజలను నమ్మకపోగా, వరుసగా రెండు ఎన్నికలలో బొటాబొటి సీట్లను ఇచ్చారు. బొటాబొటి సీట్లతో నెట్టుకు వద్దామన్నా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకరి తరువాత మరొకరు పార్టీ మారుతుండడంతో అధిష్టానం కలవరానికి గురవుతోంది.
తలోదిక్కు నేతలు..! కరువైన ఏకాభిప్రాయం..!!
ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నించగా ఇప్పుడు బీజేపీ దానికి తోడు అయింది. కాంగ్రెస్ ను చావు దెబ్బకొట్టి ఆ పార్టీ స్థానంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇంతకాలంలో కాంగ్రెస్ ను నేతలను టీఆర్ఎస్ చేర్చుకునేందుకు గేట్లు తెరవగా, ఇప్పుడు బీజేపీ ఏకంగా బార్లా తెరిచి వచ్చినవారిని వచ్చినట్లుగా చేర్చుకుంటున్నది. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపే ఎదిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. ఇక టీఆర్ఎస్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న కసి, పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్ కు టీ కాంగ్రెస్ విలవిల..! ఖాళీ అవుతున్న టీపీసిసి..!!
మొన్న జరిగిన ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచినా ఒకరి తరువాత మరొకరు చొప్పున జంప్ అవుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న వారు సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిపై అనుమానాలతో పక్క చూపులు చూస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న కౌంటింగ్ లో ఎన్నోకొన్ని ఎంపీ స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి కొంత ఊరట లభిస్తుంది. పార్టీ నాయకత్వంపై, అధిష్టానంపై కూడా నమ్మకం ఏర్పడుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ ఓడిపోతే మాత్రం పార్టీకి ముందుముందు మరింత గడ్డుకాలమే అనే చర్చ జరుగుతోంది.
లోక్ సభలో అనుకున్న సీట్లు గెలిస్తే ఓకే..! లేకపోతే దుకాణం బందే..!!
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని పార్లమెంటు స్థానాలపై చాలానే ఆశలు పెట్టుకున్నది. కనీసం ఇద్దరు ముగ్గురు అయినా గెలుస్తారనే ధీమాతో పార్టీ నేతలు ఉన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసిన నల్గొండ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేసిన భువనగిరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేసిన మల్కాజ్ గిరి, సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసిన చేవెళ్ల స్థానాలు దక్కుతాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ స్థానాలను గెలుచుకుంటే మున్ముందు పోరాటాలు, ఆందోళనలు చేసి పార్టీని పటిష్ఠం చేసుకోవవాలనే ఆశతో పార్టీ పెద్దలు ఉన్నారు.