సజ్జనార్ vs ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: రెండే రెండు రోజులు గడువు.. !!
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్కు నోటీసులు జారీ చేశారు. తనపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ప్రవీణ్ కుమార్ చేసిన ప్రకటనపై వివరణ కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును విచారించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని సజ్జనార్ తప్పుపట్టారు.
పూర్తి వివరాలు ఇవ్వాలని..
సిట్ అధిపతి సజ్జనార్, ఇతర పోలీసు అధికారులపై 2015లో ఏపీలో కేసులు నమోదయ్యాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ ప్రస్తావించిన ఈ కేసులు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తి వివరాలు ఇవ్వాలని సజ్జనార్ తన నోటీసు ద్వారా డిమాండ్ చేశారు. తనపై మోపిన ఆరోపిత ఏడు కేసుల పూర్తి, నిర్దుష్ట వివరాలను సమర్పించాలని సజ్జనార్ నోటీసులో ప్రవీణ్ కుమార్ను ఆదేశించారు.

రెండు రోజులలోపు
ఈ ఏడు క్రిమినల్ కేసుల పూర్తి, నిర్దుష్ట వివరాలను ఈ నోటీసు అందిన తేదీ నుండి రెండు రోజులలోపు సమర్పించాల్సి ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ నోటీసును తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. నిర్దేశించిన రెండు రోజులలోగా ప్రవీణ్ కుమార్ ఈ డిమాండ్ను పాటించడంలో విఫలమైతే, ఆయనపై తగిన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని నోటీసులో స్పష్టం చేశారు సజ్జనార్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ గా వ్యవహరిస్తోన్నందున బహిరంగంగా చేసిన ఆరోపణలకు సాక్ష్యాధార పత్రాలను అందజేయాలని అన్నారు.
పరువు నష్టం కలిగించేవి
ఈ ఆరోపణలు అత్యంత పరువు నష్టం కలిగించేవి, నిర్లక్ష్యమైనవి, తప్పుదోవ పట్టించేవిగా సజ్జనార్ అభివర్ణించారు. ఎలాంటి ఆధారాలు లేదా ధృవీకరించదగిన వివరాలు లేకుండానే ఈ ప్రకటనలు చేశారని నోటీసులో స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సిట్, దాని చీఫ్ ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా, అధికారిక విధులకు ఆటంకం కలిగించి, కొనసాగుతున్న దర్యాప్తుకు తీవ్ర నష్టం కలిగించే ప్రయత్నాలని అన్నారు.












Click it and Unblock the Notifications