మేడారం జాతరలో మహిళా సంఘాలకు భారీ ఆదాయం.. 4 రోజుల్లో రూ. 9 కోట్లు..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 28 నుండి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరిగింది. ఆ నాలుగు రోజుల పాటు అక్కడి పరిసరాల్లో ఎంతో సందడి వాతావరణం నెలకొంది. రెండేళ్లకు ఒకసారి రావడంతో జాతర నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి భారీ సంఖ్యలో పెరిగింది. ఇప్పటికి జాతర ముగిసి 10 రోజులు గడుస్తున్నాయి. అయినా కూడా భక్తులు వచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటూనే ఉన్నారు. ఇక మేడారం మహా జాతర హుండీల లెక్కింపు కూడా నేటితో ముగిసింది. వారం రోజుల పాటు మొత్తం 828 హుండీలను లెక్కించగా.. మొత్తం రూ.13. 25 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
ఇక సమ్మక్క- సారలమ్మ మహా జాతర-2026 సందర్భంగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి (IMS) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు భారీ ఆదాయాన్ని ఆర్జించాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని 10 మండలాలను కవర్ చేస్తూ మొత్తం 565 ఆదాయ యూనిట్లను SHG ల ద్వారా ఏర్పాటు చేయగా వారు జాతర సమయంలో రూ.3 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించారు.
మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని మేడారం జాతర ప్రాంగణంలో మహిళా సంఘాలకు అనుకూలమైన ప్రదేశాల్లో షాపులను కేటాయింప చేశారు. ములుగు జిల్లాలోని పది మండలాలకు చెందిన మహిళా సమాఖ్యల ద్వారా వివిధ రకాల వ్యాపార యూనిట్లు ఏర్పాట్లు చేయించి మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించారు. మంత్రి సీతక్క స్వయంగా ఈ యునిట్లను ప్రారంభించి వారి బిజినెస్ కు విస్తృత ప్రచారం కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహకం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడంతో మహిళలు కూల్ డ్రింక్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, ఇప్పపువ్వు లడ్డూ స్టాళ్లు, బ్యాంబూ చికెన్, క్యాంటిన్లు, స్నాక్స్ తదితర దుకాణాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారు.
జాతరలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఇతర వ్యాపార కార్యకలాపాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సమర్థంగా వినియోగించుకుని ఆర్థికంగా లాభపడ్డారు. ఈ వ్యాపారాల కోసం రూ.6 కోట్ల పెట్టుబడిని బ్యాంకులు, జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా సమకూర్చగా.. మొత్తం రూ.9.12 కోట్ల ఆదాయం లభించింది. పెట్టుబడి ఖర్చులు పోగా రూ.3 కోట్లకుపైగా లాభం వచ్చింది.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు అవుతున్న ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి ఇది నిదర్శనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రొత్సాహకం, మహిళా సంఘాల పట్టుదల, ఆడ బిడ్డల శ్రమ ఫలితమని అభినందించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడుతూ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు దృఢమైన పునాది వేసిందని మంత్రి ప్రశంసించారు.












Click it and Unblock the Notifications