అల్లు అర్జున్కు భారీ ఊరట
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. శుక్రవారం అల్లు అర్జున్కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్ నాంపల్లి కోర్టు. బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. శుక్రవారం సాయంత్రం అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేలు, రెండు పూచీకత్తులను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. రెగ్యూలర్ బెయిల్పై శుక్రవారం వాదనలు ముగియగా.. తాజాగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరుకావాలని అల్లు అర్జున్ను ఆదేశించింది.

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఒకరోజు తర్వాత అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
అయితే, నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో అల్లు అర్జున్ వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యూలర్ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శుక్రవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. తొక్కిసలాటలో తీవ్రగాయాలపాలైన ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. కోటి, దర్శకుడు సుకుమార్ రూ. 50 లక్షలు, పుష్ప2 నిర్మాతలు రూ. 50 లక్షలు సాయం అందజేసిన విషయం తెలిసిందే. మరోవైపు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల సాయం అందించారు.












Click it and Unblock the Notifications