సారిక, ఆమె పిల్లల మృతి: పోస్టుమార్టం నివేదికలో ఏముంది?
వరంగల్: వరంగల్ మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదిక గురించి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు డా.నాగమోహన్ మీడియాతో చెప్పారు.
సారిక, ముగ్గురు పిల్లల అవయవాల్లో వేడి తీవ్రత వల్ల ఎముకలు విరిగాయని ఆయన చెప్పారు. మరణించిన తర్వాత కాలబెట్టినట్టు ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. ఎక్కువ సేపు మంటల్లో కాలడం వల్ల శ్వాస కోశాలు పొగచూరి ఉన్నాయని నాగమోహన్ చెప్పారు.
Photos: రాజయ్య కోడలు మృతి
మత్తుమందు ఇచ్చి చంపేసి శవాలకు నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన విషయాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దీని ఆధారంగానే సారికది ఆత్మహత్యనా, హత్యనా అనే విషయం తేలే అవకాశాలున్నాయి.
సారిక, ఆమె ముగ్గురు పిల్లలు ఎలా మరణించారనే విషయాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. రాజయ్య నివాసంలోని ఆహార పదార్థాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపించారు. రెండో రోజు గురువారం కూడా పోలీసులు రాజయ్యను, ఆయన భార్య మాధవిని, కుమారుడు అనిల్ కుమార్ను ప్రశ్నించారు.