రాజయ్య మార్నింగ్ వాక్: పిల్లల్ని లోపలకు తీసుకెళ్లి, సిలిండర్లు లీక్ చేసిన సారిక
వరంగల్: సారికది ఆత్మహత్యేనని, రెండు సిలిండర్లను ఆమెనే గదిలోకి తీసుకు వెళ్లి లీక్ చేసిందని పోలీసులు తేల్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు గత బుధవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే.
సిలిండర్లను తనే పట్టుకెళ్లిందని, పిల్లల్ని లోపలికి తీసుకెళ్లి గ్యాస్ లీక్ చేసిందని పోలీసులు తేల్చారు. భర్త, అత్తమామల హింసలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. సారికది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు. పిల్లల్ని గదిలోకి తీసుకెళ్లి ఆత్మాహుతికి పాల్పడినట్టు పేర్కొన్నారు.
రాజయ్య, ఆయన కుమారుడు అనిల్కుమార్, భార్య మాధవి, అనిల్ రెండో భార్య సన పెట్టిన చిత్రహింసలతో జీవితం మీద విరక్తి చెంది సారిక ఇలా చేసిందన్నారు. రాజయ్య కుటుంబాన్ని అరెస్టు చేశాక జడ్జి ముందు హాజరుపరిచి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలీసులు రిమాండ్ నివేదికను జడ్జికి సమర్పించారు. అందులో పలు కీలకమైన విషయాల్ని వెల్లడించారు. ఘటన జరిగినప్పటి నుంచి 24 మందిని ప్రశ్నించామని, వారినుంచి సేకరించిన వివరాల మేరకు నివేదిక సమర్పిస్తున్నామని పోలీసులు తెలిపారు.
రాజయ్య కుటుంబంతో కలిసి సారికను హింసించిన సన ఇప్పుడు పరారీలో ఉందని పేర్కొన్నారు. రాజయ్య, మాధవి, అనిల్తోపాటు సన ఈ నెల 3న సారిక ఉంటున్న ఇంటికి వచ్చారని, ఈ నలుగురూ కలిసి ఆమెను హింసించారని పేర్కొన్నారు.
తనకు న్యాయం కావాలని కోర్టుల చుట్టూ తిరగడం, కేసులు పెట్టడం మీదే వారు సారికను వ్యతిరేకించినట్లు తెలుస్తోందని, ఈ రకమైన హింస కారణంగానే ఆమె తన జీవితం మీద విరక్తి పెంచుకుందని, రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, మళ్లీ ఎంపీ అయితే తమని ఇంకా హింసిస్తారని, రాజకీయ పలుకుబడితో పలురకాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని సారిక భావించినట్లు సన్నిహితుల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు.
ఇందుకు పిల్లలు కూడా బలికావాల్సి వస్తుందని భావించిందని, ఈ నేపథ్యంలో ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్యకు సిద్ధపడిందని, వంటగదిలో ఉన్న సిలిండర్లను తనే తీసుకెళ్లి గ్యాస్ లీక్ చేసుకుందని, ఈ ఘటన తెల్లవారుజామున 4 నుంచి 4.30 గంటల మధ్యలో జరిగిందని పేర్కొన్నారు.
రోజూ ఉదయపు నడకకు వెళ్లే రాజయ్య, ఆ రోజు కూడా అలా లేచిన తర్వాత, ఏదో వాసన రావడం గమనించారని, ఆ తర్వాత చుట్టుపక్కలవారు ఇంట్లో పొగలొస్తున్నాయని చెప్పడంతో డ్రైవర్లు, స్థానికులు కలిసి డోరు పగులగొట్టారని, అప్పటికి లోపల డోర్ గడియపెట్టి ఉందని పేర్కొన్నారు.
సారికను ప్రేమ వివాహం చేసుకున్న అనిల్.. సన అనే మహిళను రెండో భార్యగా స్వీకరించారుని, అనిల్, సనాలకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ బంధం మీద కూడా సారిక అనిల్ను ప్రశ్నించేదని, కానీ అతను పట్టించుకునేవాడు కాదని తెలిపారు.
రాజయ్య, మాధవి అతన్నే వెనకేసుకొచ్చేవారని, సనాతో సహా వీరంతా సారికను మానసికంగా, శారీరకంగా హింసించారని తెలిసిందని, హైదరాబాద్లో సారిక కేసును వాదిస్తున్న రెహానా మమ్మల్ని సంప్రదించారని, గతంలో సారిక పంపిన ఈ మెయిల్ను అందించారని రిపోర్టులో తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆధారాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని, ఆ నివేదికలు రాగానే మిగిలిన విచారణ పూర్తిచేసి ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు.