భార్యకు చివరి కాల్, సారీతో సరిపెట్టిన డా. శశికుమార్: బతకనని చంద్రకళకు ఫోన్
హైదరాబాద్: డాక్టర్ శశికుమార్ మృతి విషయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్త శశికుమార్ తనతో మాట్లాడలేదని క్రాంతి చెబుతున్నప్పటికీ చివరి కాల్ ఆమెకే చేసినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి పదకొండున్నర ప్రాంతంలో శశికుమార్ భార్య క్రాంతికి ఫోన్ చేశాడు.
సారీ అని చెప్పేసి ఫోన్ స్విచాఫ్ చేశాడు. అంతకు ముందే అతను తనను ఫామ్ హౌస్లో దిగబెట్టిన చంద్రకళతో పది నిమిషాల పాటు మాట్లాడాడు. తాను చనిపోతున్నట్లు ఆమెకు శశికుమార్ పదే పదే చెప్పాడు. చంద్రకళ పోలీసులతో ఫోన్లో మాట్లాడి కొన్ని విషయాలు చెప్పినట్లు సమాచారం. డాక్టర్ల గొడవతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆమె చెప్పారు.
తనకు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఫోన్ చేసి, ఒక్క రోజు కోసం ఫామ్ హౌస్లో ఉంటానని కోరాడని, దాంతో తాను అతన్ని అతని కారులోనే ఫామ్ హౌస్లో దించేసి, మద్యం కావాలంటే తెచ్చి ఇచ్చేసి తిరిగి వచ్చానని చంద్రకళ చెప్పారు.
ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చానెళ్లు చూసేసరికి శశికుమార్ కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలిసిందని, దాంతో తాను శశికుమార్కు ఫోన్ చేశానని, అయితే, అతని ఫోన్ స్విచాఫ్ అయి ఉందని ఆమె చెప్పారు.
టీవీ చానెళ్లలో చూసిన తర్వాత తాను పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పానని కూడా ఆమె చెప్పారు. శశికుమార్ ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని ఆమె చెప్పారు. డాక్టర్ సాయి కుమార్ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వైద్యుల మధ్య గొడవలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎవరెవరు ఎంతెంత పెట్టుబడి పెట్టారు అనే విషయాలను సాయి కుమార్ నుంచి రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.