హైదరాబాదీయులకు అలర్ట్- ఎంఎంటీఎస్ సర్వీసులకు కొత్త టైమ్ టేబుల్: వందే భారత్ కోసం
Hyderabad MMTS: హైదరాబాద్ కమ్యూటర్స్కు బిగ్ అలర్ట్. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (MMTS) సర్వీసుల్లో రాకపోకలు సాగించే వారు ఇక నుంచి కొత్త టైమ్టేబుల్ను అనుసరించాల్సి ఉంటుంది. మారిన కొత్త సమయ పాలన పట్టిక నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వివిధ నగరాలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఆయా స్టేషన్లల్లో హాల్ట్ అయ్యే ఆ రైళ్ల కనెక్టివిటీకి అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ప్రయాణికులు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుకునేలా సవరణలు చేశారు. ఈ సవరణలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.

ప్రస్తుతం జంటనగరాల్లో మొత్తం 88 ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి. సికింద్రాబాద్- మేడ్చల్, ఫలక్నుమా- ఊందానగర్, ఘట్కేసర్- లింగంపల్లి మధ్య ఆయా సర్వీసులు రాకపోకలు సాగిస్తోన్నాయి. రోజూ మూడు లక్షలమందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
ట్రైన్ కంట్రోల్, మేనేజ్ మెంట్ వ్యవస్థ ద్వారా ఎంఎంటీఎస్ సర్వీసులు వీటి రాకపోకలన్నీ పనిచేస్తోయి. ఫలితంగా- ఏ రైలు, ఎన్ని నిమషాలకు, ఏ స్టేషన్ కు వస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించ వచ్చు. విద్యుత్ను పునరుత్పాదించే బ్రేకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్రేక్ వేసినప్పుడల్లా విద్యుత్ ఆదా అయ్యేలా ఏర్పాటు చేశారు.
ర్యాక్స్ లోపల, బయటి వైపు ఎల్ఈడీ ఆధారిత డిస్ ప్లే బోర్డులను అమర్చారు. ఎప్పటికప్పుడు స్టేషన్ల వివరాలు దానిపై ప్రదర్శితమవుతాయి. మెట్రో రైళ్ల తరహాలో ఆటోమేటిక్ అనౌన్స్ మెంట్ ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో స్టేషన్ అనౌన్స్ మెంట్ ఉంటుంది.
వందే భారత్ రైళ్ల సమయానికి అనుగుణంగా ఎంఎంటీఎస్ కనెక్టివిటీని పెంచాలంటూ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు పలువురు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎంఎంటీఎస్ సర్వీసుల సమయాలన్నీ కూడా మారాయి. అలాగే- కొత్త పబ్లిక్ టైమ్టేబుల్ సైతం నేటి నుంచి అమలులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications