తెలంగాణలో పాఠశాల వేసవి సెలవులు పొడిగింపు: ఇంటర్ సెకండీయర్ ఫలితాల వెల్లడికి కసరత్తు
హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు మరో ఐదు రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పొడిగించిన వేసవి సెలవులు మంగళవారంతో ముగిశాయి. దీంతో జూన్ 20 వరకు సెలవులను పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ జూన్ 19 వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే వేసవి సెలవులను పొడిగించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. జులై 1 నుంచి ఆన్లైన్ తరగతులతో విద్యా సంవత్సరం ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. మొదటి సంవత్సరం విద్యార్థులను ఇప్పటికే సెకండీయర్కు ప్రమోట్ చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఇది ఇలావుండగా, తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఫలితాల వెల్లడి కోసం అనుసరించాల్సిన విధి విధానాలను కమిటీ రూపొందించింది. కమిటీ సిఫార్సులతో కూడిన నివేదికను మంగళవారం ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రభుత్వానికి సమర్పించారు. కాగా, మొదటి సంవత్సరం మార్కులను ప్రామాణికంగా తీసుకుని.. రెండో సంవత్సరం మార్కులు వేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిన వారం పది రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.