సికింద్రాబాద్ రూపురేఖలు మార్చేసే ఎక్స్ ప్రెస్ వే
Revanth Reddy: హైదరాబాద్ కోర్ సిటీకి మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి సారించింది. కోర్ అర్బన్ సిటీతో పాటు, సెమీ అర్బన్, రూరల్, అవుటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాలను పూర్తిస్థాయి అభివృద్ధిపై ప్రత్యేకంగా ఓ ప్రణాళికను రూపొందించనుంది.
పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్రమైన పాలసీని తయారు చేయాలని ఆదేశించారు.

దీనికి అనుగుణంగా హెచ్ఎండీఏ రక్షణ మంత్రిత్వ శాఖతో ఓ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని వల్ల హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెల్లుచీటీ పడబోతోంది. ఈ ఒప్పందాల్లో భాగంగా రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ఒప్పందం కుదిరింది.
ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్పేట్, డైరీ ఫామ్ రోడ్ వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, రక్షణ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి 65.038 ఎకరాల భూమిని అప్పగిస్తుంది. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు 435 ఎకరాలను అందిస్తుంది.
ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ గత ఏడాది మార్చి 1వ తేదీన అనుమతి ఇచ్చింది. రక్షణ భూమి బదిలీకి సంబంధించిన పద్ధతులు, కాలపరిమితులు, విధానాలు ఈ అవగాహన ఒప్పందంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, రక్షణ శాఖ నుంచి తెలంగాణ సబ్ ఏరియా మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రతిపాదిత రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అవసరమైన ఏ1 రక్షణ భూమి బదిలీకి సంబంధించిన ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం జంట నగరాల్లో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో ఈ కారిడార్లను హెచ్ఎండీఏ నిర్మిస్తుంది.
- ప్యారడైజ్ జంక్షన్ (జింఖానా గ్రౌండ్స్) నుండి షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు దాదాపుగా 18.14 కిలో మీటర్ల వరకు ఒకటి, ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్ వరకు సుమారు 5.32 కిలో మీటర్ల వరకు మరొక కారిడార్ అందుబాటులోకి వస్తుంది.
- ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్పేట్ కారిడార్- వెస్ట్ మారేడ్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, ఆల్వాల్, హకీంపేట్, తుంకూరు మీదుగా నిర్మితమౌతుంది.
- ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్ వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్- సికింద్రాబాద్, తాడ్బండ్ జంక్షన్, బోయిన్పల్లి జంక్షన్ వంటి ప్రాంతాల గుండా వెళుతుంది. ఇది డైరీ ఫామ్ రోడ్ వద్ద ముగుస్తుంది.
- ఈ కారిడార్ల నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.












Click it and Unblock the Notifications