టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్ ఖరార్..
TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు తదుపరి చైర్మన్ ఎవరో తేలిపోయింది. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్గా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కొద్ది సేపటి కిందటే గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదించారు.
అత్యంత కీలకమైన, లక్షలాది మంది ఉద్యోగార్థులకు దిక్సూచి వంటి టీజీపీఎస్సీ ఛైర్మన్ పదవి- వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన అధికారికి లభించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం మహేందర్ రెడ్డి పని చేస్తోన్నారు. ఆయన పదవీ కాలం డిసెంబర్ 3వ తేదీన ముగియబోతోంది.

ఐపీఎస్ అధికారిగా 2022 డిసెంబర్లో మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ ఏడాది జనవరిలో టీజీపీఎస్సీ ఛైర్మన్గా నియమితులు అయ్యారు. ఆయన పదవీ కాలం డిసెంబర్ 3వ తేదీ నాటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టింది. చివరికి బుర్రా వెంకటేశం వైపు మొగ్గు చూపింది.
నిజానికి- పదవీ విరమణ చేసిన అత్యున్నత అధికారులు, విద్యావేత్తలను ఈ పదవిలో నియమించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుర్రా వెంకటేశం ఇంకా సర్వీసులోనే ఉన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తోన్నారు. తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. వీఆర్ఎస్కు కూడా దాఖలు చేశారు.
1995 బ్యాచ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిిన అధికారి బుర్రా వెంకటేశం. రాష్ట్ర విభజన తరువాత ఆయనను తెలంగాణకు కేటాయించింది డీఓపీటీ. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1995లో సివిల్స్కు ఎంపికయ్యారు.
2014లో ఏర్పాటైన ఏపీ పునర్వ్యవస్థీకరణ కమిటీలో ఆయన సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. వ్యవసాయం, ఉద్యానవనాలు, పౌర సరఫరాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల్లో పని చేశారు. టీజీపీఎస్సీ చైర్మన్గా డిసెంబర్ 2వ తేదీన బుర్రా వెంకటేశం బాధ్యతలను స్వీకరించనున్నారు.












Click it and Unblock the Notifications