భీతావహం: మృతులు వీరే?, ఆ లారీ బస్సును చీల్చేసింది.. ప్రమాదం జరిగిందిలా!
Recommended Video

హైదరాబాద్: సమయం మంగళవారం ఉదయం 9:20గం. బస్సులో 51మంది ప్రయాణికులు. మరికొద్దిసేపట్లో వారంతా గమ్య స్థానాల్లో దిగిపోతారు. కానీ ఇంతలోనే ఊహించని విషాదం. మృత్యువు లారీ రూపంలో తరుముకొచ్చింది. అతివేగంతో ఆ లారీ బస్సును ఢీకొట్టడంతో బస్సులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరికొంతమంది కాళ్లు తెగి, చేతులు తెగి.. శరీరమంతా రక్తంతో... మొత్తంగా ఆ సంఘటనా స్థలం భీతావహ దృశ్యాన్ని తలపించింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల వద్ద ఈ ఘోరం జరిగింది.

ఎలా జరిగింది?:
హుజూరాబాద్ డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు మంగళవారం ఉదయం కరీంనగర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో చెంజర్ల గ్రామం వద్దకు చేరుకోగానే.. వరంగల్ వైపు వెళ్తున్న ఓ లారీ బస్సును ఢీకొట్టింది. ముందు వెళ్తున్న మరో లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో.. బస్సును మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో సీట్లలో కూర్చున్నవాళ్లు సీట్లలోనే చనిపోయారు. మరికొంతమంది కాళ్లు చేతులు తెగిపడి విలవిల్లాడిపోయారు. ప్రమాద సమయంలో బస్సు వెనకాల బైక్ పై ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.

మృతులు వీరే..:
ప్రమాద సమయంలో బస్సులో 51మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో సైదాపూర్కు చెందిన పేరాల ప్రభాకర్(56), జమ్మికుంటకు చెందిన కాంట్రాక్ట్ లెక్చరర్ గుండ హరిప్రసాద్(31), హన్మకొండలోని గోపాల్పూర్కు చెందిన రాయబారపు సుభాషిణి(42), మానకొండూర్ మండలం ముంజంపల్లికి చెందిన గృహిణి పిల్లి లక్ష్మి(60), వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలికి చెందిన ప్రైవేటు ఉద్యోగి అయిలోని నాగరాజు(28), హైదరాబాద్ ముషీరాబాద్కు చెంది న జాకీర్ అహ్మద్ (42), వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటకు చెందిన రైల్వే డిప్యూటీ సీఈ రాజేశ్ పటేల్ ఉన్నారు.

కరీంనగర్ ఆసుపత్రికి:
లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్ సహా మొత్తంగా 30 మంది క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అపోలో ఆసుపత్రికి తరలించారు. లారీ బస్సును ఢీకొట్టిన సమయంలో బస్సుపై ఉన్న ఓ విడిభాగం విరిగి సైకిల్ పై వెళ్తున్న ఉమర్ అనే యువకుడిపై పడటంతో అతనికి బలమైన గాయమైంది. లారీ డ్రైవర్ అజయ్శర్మ(42)కు కాలు, చేయి విరిగాయి. బస్సుడ్రైవర్ గోపు యుగంధర్రెడ్డి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు.

రూ.5లక్షల ఎక్స్గ్రేషియా:
మృతుల కుటుంబాలకి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదవార్త తెలియగానే ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో కలిసి మంత్రి ఈటల రాజేందర్ హుటాహుటిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రివెళ్లారు. అక్కడ చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు తెలిపారు.

లారీ అతివేగమే కారణం
లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమైందంటున్నారు. 30అడుగుల వెడల్పు రోడ్డులో లారీ డ్రైవర్ ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ లారీలో వరంగల్కు కోళ్లదాణాను తరలిస్తున్నట్టు చెప్పారు. కాగా, లారీ డ్రైవర్ మద్యం సేవించాడని స్థానికులు ఆరోపించడం గమనార్హం. ఇదిలా ఉంటే రీంనగర్-వరంగల్ రహదారి విస్తరణ విషయంలో జరుగుతున్న జాప్యం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications