కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బొనాంజా: గరిష్ట వేతనం రూ.2.5 లక్షలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బొనాంజా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు జీత భత్యాలు, పింఛను 23.55 శాతం పెంచుతూ ఏడో వేతన సంఘం సిఫార్సు చేసింది. ఉద్యోగుల వేతనంలో 16 శాతం, అలవెన్సులలో 63 శాతం, పెన్షన్లో 24 శాతం పెంపు ఉండనుంది.
2016 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ఏడో వేతన సంఘం సిఫార్సు చేసింది. దీంతో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనిష్ట వేతనం రూ.18,000, గరిష్ట వేతనం రూ.2.5 లక్షలుగా ఉండనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భీమా.. గ్రాట్యుటీ పరిమితి రెట్టింపు అవుతుంది.
ఉద్యోగులందరికీ పనితీరు సంబంధిత వేతనం (పీఆర్పీ) ప్రవేశ పెట్టాలని ఏడో వేతన సంఘం నివేదికలో పేర్కొంది. సాయుధ దళాలు, ప్రభుత్వ ఉద్యోగులకూ కూడా ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ విధానం (ఓఆర్ఓపీ) ఉండాలని సూచించింది.
భద్రతా బలగాల్లో పదవీ విరమణ వయస్సు అరవై సంవత్సరాలకు పెంచాలని పేర్కొంది. షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు ఏడు నుంచి పది ఏళ్ల సర్వీసులో రిటైర్ కావొచ్చు. సిబిఐ డైరెక్టర్ వేతనం రూ.90 వేలకు పెంచే ప్రతిపాదనను కమిషన్ తిరస్కరించింది.
ఈ నివేదికను ఏడో వేతన సంఘం చైర్మన్ మాథుర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించారు. ఈ సిఫార్సుల ద్వారా ఖజానా పైన రూ.లక్ష కోట్ల అదనపు భారం పడుతుందని అరుణ్ జైట్లీ వెల్లడించారు.
కాగా, ప్రస్తుతం కనీస వేతనం రూ.ఏడువేలుగా ఉంది. కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి జీతం ప్రస్తుతం నెలకు రూ.90వేలుకాగా ఇప్పుడు రూ.2.5లక్షలకు స్థిరపర్చింది. కార్యదర్శుల ప్రస్తుత వేతనం రూ.80వేలు కాగా రూ.2.5లక్షలుగా స్థిరపర్చింది.
ఈ సిఫార్సుల అమలుకు ప్రభుత్వం అదనంగా ఏడాదికి రూ.1.02లక్షల కోట్లను భరించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై ప్రభావం చూపే మొత్తం రూ.73,650 కోట్లు. రైల్వే బడ్జెట్పై రూ.28,450 కోట్ల ప్రభావం పడుతుంది.
మొత్తం వేతనాల బిల్లు రూ.4.33లక్షల కోట్ల నుంచి రూ.5.35లక్షల కోట్లకు చేరుతుంది. ఈ నివేదికను వ్యయ కార్యదర్శి నేతృత్వంలోని సచివాలయం అధ్యయనం చేస్తుంది. ఆ తర్వాతే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది. జస్టిస్ ఎకె మాథుర్ నేతృత్వంలోని ఏడో వేతన సవరణ సంఘం గురువారం ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీకి 900 పేజీల నివేదికను సమర్పించింది.