హైదరాబాద్ ఘనత మా నాన్నదే, మెట్రో పూర్తయ్యేది: షర్మిల (ఫొటోలు)
హైదరాబాద్: హైదరాబాద్ను గ్రేటర్ సిటీగా అభివృద్ధి చేసింది తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల అన్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఆమె మంగళవారం పరామర్శ యాత్ర చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే మెట్రో రైలు నిర్మాణం పూర్తయి ఉండేదని ఆమె అన్నారు. దేశంలోనే అతి పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేసిన ఘనత తనదేనని ఆమె అన్నారు. కృష్ణా, గోదావరి జలాలతో హైదరాబాద్ దాహార్తిని తీర్చింది కూడా వైయస్సేనని ఆమె అన్నారు.
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది కూడా వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆమె అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో వైయస్ రాజశేఖర రెడ్డి ఉంటారని ఆమె అన్నారు. హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధి పెంచుతూ నగర శివార్లలోని మున్సిపాలిటీలను, గ్రామాలను విలీనం చేస్తూ జిహెచ్ఎంసిని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
పల్లెలు సైతం...
జిహెచ్ఎంసి ఏర్పాటుతో మహానగరాన్ని ఆనుకుని ఉన్న పల్లెలు సైతం అభివృద్ధి పట్టాలెక్కాయని వైయస్ షర్మిల చెప్పారు. హైదరాబాదులో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేసిందని వైయస్సేనని అన్నారు.
80 కిలోమీటర్ల మేర..
శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల మీదుగా వైయస్ షర్మిల పరామర్శ యాత్ర 80 కిలోమీటర్ల సాగింది. ఎనిమిది కుటుంబాలను ఆమె పరామర్శించారు.
ప్రపంచంలోనే మేటి నగరంగా..
ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాదును తిర్చిదిద్దాలని వైయస్ రాజశేఖర రెడ్డి కలలు కన్నట్లు వైయస్ షర్మిల చెప్పారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పివీ ఎక్స్ప్రెస్ హైవేను వైయస్ పూర్తి చేశారని చెప్పారు.
చంద్రబాబు హయాంలో ఐటి ఇలా...
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటి ఎగుమతులు 2 శాతం ఉంటే వైయస్ హయాంలో అవి 9 నుంచి 14 శాతానికి పెరిగాయని వైయస్ షర్మిల చెప్పారు.