టీఆర్ఎస్లో ముసలం: పలుచోట్ల కాంగ్రెస్లో చేరిక, ఇంద్రకరణ్ పైనా అసంతృప్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ తగులుతోంది. ఇంద్రకరణ్ రెడ్డి పైన అసంతృప్తితో నిర్మల్లో పలువురు నేతలు టీఆర్ఎస్కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
చదవండి: భార్య తీరుతో దామోదర మనస్తాపం, ప్రచారం నిలిపేసి..: పద్మిని అందుకే తిరిగి వచ్చారా?
మెదక్ జిల్లా అల్లాదుర్గంలో టీఆర్ఎస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు ముందు పలుచోట్ల వివిధ స్థాయిల్లోని నాయకులు పార్టీలు మారుతున్నారు.
నిర్మల్ టీఆర్ఎస్లో ముసలం
నిర్మల్ టీఆర్ఎస్ పార్టీలో ముసలం రాజుకుంది. మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ఇరవై మంది కౌన్సెలర్లు రాజీనామా చేశారు. వారు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వైఖరికి నిరసనగా వారు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ.. తాము ఇన్నాళ్లు నిర్మల్ అభివృద్ధి కోసం భరించామని, ఇంద్రకరణ్ తీరు మారకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ గెలుపు ఖాయం
మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ సమక్షంలో టీఆర్ఎస్ నాయకురాలు, అల్లాదుర్గం ఎంపీపీ ఇందిర కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీది మోసం, అబద్దాలతో కూడిన పాలన అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు. స్వేచ్ఛ, పారదర్శకత, జవాబుదారీతన పాలన కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు. వాగ్ధానాలను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పారు.
మరికొంతమంది కాంగ్రెస్లోకి
నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి సమక్షంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పారు. త్వరలో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలిపారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాటం చేశానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐఆర్ పైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత ప్రభాకర్ రెడ్డికి చిన్న కొండూరులో గ్రామస్తులు షాకిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన వాహనాన్ని గ్రామస్తులు, అఖిలపక్ష నేతలు అడ్డుకున్నారు. నాలుగున్నరేళ్లలో గ్రామానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులకు, గ్రామస్తులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను సముదాయించారు.