హైదరాబాద్లో దారుణం... కరోనా పేషెంట్ డెడ్ బాడీని పీక్కుతిన్న కుక్కలు...
కరోనా వేళ చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు మనసుల్ని కలచివేస్తున్నాయి. ఒక్క వైరస్ మనిషిని ఎంత అద్వాన్న స్థితికి నెట్టివేసిందన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. ఇటీవల బళ్లారిలో 18 మంది కరోనా పేషెంట్ల మృతదేహాలను ఒక గుంతలోకి విసిరిపారేసిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ ఆవేదనకు గురిచేసింది. తాజాగా హైదరాబాద్లో అంతకుమించిన దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన ఓ పేషెంట్ మృతదేహం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో... ఆఖరికి దాన్ని కుక్కలు పీక్కుతున్న అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.

శ్మశానంలోకి వెళ్లగానే షాక్...
హైదరాబాద్ ఈఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. ఇటీవల ఓ వృద్దుడు కరోనాతో మృతి చెందగా అధికారులే ఇక్కడి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మరుసటిరోజు ఆ వృద్దుడి మనువడు అస్థికల కోసం శ్మశానికి వెళ్లాడు. అక్కడ సగం కాలిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతుండటంతో షాక్ తిన్నాడు.

అధికారుల నిర్లక్ష్యం...
ఆ యువకుడు అక్కడి దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... శ్మశాన నిర్వాహకులు,జీహెచ్ఎంసీ సిబ్బంది ఎవరికి వాళ్లు తమకు సంబంధం లేదని చెబుతున్నారు. శ్మశాన వాటిక ఇన్చార్జి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. కరోనా మృతుల దహన సంస్కారాల బాధ్యత జీహెచ్ఎంసీ సిబ్బందిదే అని చెప్పారు. మరోవైపు ఏంఎహెచ్ఓ డాక్టర్ భార్గవ నారాయణ మాత్రం... మృతదేహాలను పూర్తిగా కాలేవరకూ చూడాల్సిన బాధ్యత శ్మశాన వాటిక నిర్వాహకులదేనని చెప్పారు.

అసలే దు:ఖంలో ఉన్నవేళ...
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కరోనా పేషెంట్లకు ఈఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో దహనం చేస్తున్నారు. ఆ వృద్దుడు కూడా గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మరణించడంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మృతదేహం పూర్తిగా కాలేవరకు పర్యవేక్షించకపోవడం... తప్పును అధికారులు ఒకరిపై ఒకరు నెట్టివేసుకుంటుండటంతో బాధితులు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యుడిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న వేళ... ఇలాంటి ఘటనలు మరింత కలచివేస్తున్నాయని వాపోతున్నారు. తమ లాంటి పరిస్థితికి ఇంకొకరికి ఎదురుకావొద్దని... కనీసం ఇకనైనా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
Recommended Video

బళ్లారిలోనూ అమానవీయ ఘటన
ఇటీవల కర్ణాటకలోని బళ్లారిలో చోటు చేసుకున్న ఘటనపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కరోనాతో మృతి చెందిన 18 మంది మృతదేహాలను గోతుల్లోకి విసిరేయడం చాలామందిని కలచివేసింది. జేసీబీలతో రెండు పెద్ద గోతులు తవ్విన అధికారులు... ఒక దాన్లో 8 మృతదేహాలు, మరొక గోతిలో 10 మృతదేహాలను విసిరేసి పూడ్చిపెట్టారు. అమానవీయంగా ఉన్న ఈ ఘటన పట్ల బళ్లారి డిప్యూటీ కమిషనర్ విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications