అలా చేసి బతికున్న శవంగా మారతారా.. మునుగోడు ఓటర్లకు అల్టిమేటం ఇస్తూ షాకింగ్ పోస్టర్లు!!
మునుగోడు ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా సాగుతుంది. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మునుగోడు ప్రజలను తమవైపు తిప్పుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టాయి. మునుగోడు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుంది. ఓటర్లను డబ్బులతో ప్రలోభపెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక ప్రతిరోజూ విందులతో మునుగోడు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ పార్టీల నాయకులు.
ఐదేళ్ళ భవిష్యత్ ను అమ్ముకుంటారా? మునుగోడులో పోస్టర్లు
దీంతో మునుగోడు ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి నియోజకవర్గంలో పోస్టర్లు వేస్తూ ప్రయత్నం సాగిస్తున్నారు యువత. మునుగోడు నియోజకవర్గంలో ఓటును అనుకోవద్దని, మద్యానికి, డబ్బులకు ప్రలోభ పడవద్దని సూచిస్తూ పోస్టర్లు వేస్తున్నారు. డబ్బులకు, మద్యానికి ఐదు సంవత్సరాల భవిష్యత్తును అమ్మిన మనిషి బ్రతికున్న శవం తో సమానం అంటూ మునుగోడులో పోస్టర్లను పెద్దఎత్తున వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటును అమ్ముకోవద్దు అని సూచిస్తూ ప్రజలలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
నోటుకు ఓటు అమ్ముకుంటే బతికున్న శవంతో సమానం
సంక్షేమం, సామరస్యం, సామాజిక న్యాయం, అభ్యుదయం, అర్హత, నిబద్ధత ఉన్న నాయకులకు ఓటు వేసి గెలిపించాలని, తద్వారా దేశాన్ని మార్చాలని పెద్దఎత్తున పోస్టర్లు వేశారు. నోటుకు ఓటును అమ్ముకునే వ్యక్తి శవంతో సమానం అంటూ ఆ పోస్టర్లలో రాశారు. దీంతో మునుగోడులో ఓటర్లకు అల్టిమేటం జారీ చేస్తూ వెలిసిన పోస్టర్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓటును అమ్ము కుంటావో.. బతికున్న శవంగా మారతావో తేల్చుకో అంటూ మునుగోడు ఓటర్లు ఆలోచించేలా ఆసక్తికర పోస్టర్లు ప్రస్తుతం మునుగోడులో దర్శనమిస్తున్నాయి.
ఓటర్లలో చైతన్యం వస్తుందా? స్థానికంగా పోస్టర్ లపై చర్చ
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు విపరీతంగా డబ్బులు పంచడానికి, మద్యంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, రకరకాల తాయిలాలు ఇచ్చి, బంపర్ ఆఫర్ ల తో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మునుగోడు ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి వెలుస్తున్న పోస్టర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి మునుగోడు ఓటర్లలో ఈ పోస్టర్లు ఎంతవరకు చైతన్యం తీసుకు వస్తాయి? మునుగోడు ప్రజలను ఎంత మేరకు ఆలోచింపజేస్తాయి అనేది భవిష్యత్తు ఎన్నికలలో తేలనుంది.