షాకింగ్ ..... ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన బస్సు దొంగలు.. బస్సులకు భద్రత కరువు
Recommended Video
కార్ల చోరీలు విన్నాం.. బైక్ దొంగతనాలు చూశాం .. కానీ బస్సుల దొంగతనాలు ఎప్పుడైనా విన్నామా . ఇప్పుడు అది కూడా వింటున్నాం . చిన్న చిన్న వాహనాలు ఏం దొంగతనం చేస్తామనుకున్నారో.. ఏమో గానీ ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశారు దుండగులు.

సీబీఎస్ బస్ స్టాప్లో పార్క్ చేసిన బస్సు చోరీ
హైదరాబాద్లోని సీబీఎస్ బస్ స్టాప్లో ఈ నెల 23వ తేదీ రాత్రి ఓ ఆర్టీసీ బస్సును డ్రైవర్ వెంకటేశం , కండక్టర్ రాహుల్ పార్క్ చేసి వెళ్ళారు . తెల్లవారు జామున తిరిగి డ్యూటీకి వచ్చి చూసేసరికి ఆ బస్సు అక్కడి నుంచి మాయమైంది. ఎంతకీ బస్సు ఏమైందో ఆ డ్రైవర్ కు బోధ పడలేదు . ఎవరు ఎత్తుకెళ్లారు.. ఎక్కడికి తీసుకెళ్లారు అన్నది అంతుచిక్కలేదు. అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బందికి కూడా తెలీకుండా ఎంచక్కా బస్సును ఎత్తుకెళ్ళారు . ఈ నేపథ్యంలో అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు.

కేసు నమోదు ...బస్సు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులకు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆ బస్సు తూప్రాన్ టోల్గేట్ దాటినట్టు సీసీటీవి ఫుటేజీ ద్వారా గుర్తించారు. బస్సు నాందేడ్ వైపుగా వెళ్తున్నట్టు చెప్పిన పోలీసులు ఆ బస్సు చోరీ చేసిన దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు . బస్సును గుర్తించిన పోలీసులు అది కుషాయిగూడ డిపోకి చెందినదిగా తెలిపారు. 2009 మోడల్కి చెందిన ఆ బస్సు నంబర్ AP11Z6254గా చెప్పారు.

బస్సులకు భద్రత కరువు .. బస్సుల భద్రతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం
2016లో కూడా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే రెండు బస్సులు చోరీకి గురయ్యాయి. తాజా ఘటనతో ఆర్టీసీ బస్సులకు భద్రత లేకుండా పోయిందన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఇక బస్సులను దాచిపెట్టటం ఎలా అన్న ప్రశ్న ఆర్టీసీలో సైతం ఉత్పన్నం అవుతుంది. బస్సుల భద్రతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సరైన సెక్యూరిటీ లేకుంటే బస్సులను కాపాడటం కూడా కష్టం అవుతుందనే భావన సైతం వ్యక్తం అవుతుంది. ఇక ఈ బస్సు దొంగతనం చేసిన చోరుల గురించి ఈ వార్త తెలిసిన వాళ్ళు వాళ్ళు మామూలోళ్ళు కాదు అని బస్సునెలా దొంగతనం చేశారబ్బా అని తెగ ఆలోచించేస్తున్నారు.












Click it and Unblock the Notifications