సిద్దిపేట కలెక్టర్ హోం క్వారంటైన్, ఇంటినుంచే విధులు, సమస్యల పరిష్కారంపై ఫోకస్..
కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ప్రతీ నిత్యం ప్రజలతో మమేకయ్యే అధికారులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. అయితే ఇటీవల సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డిని జెడ్పీటీసీలు కలిశారు. కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలు పాములపర్తి, ఇతర గ్రామస్తులతో కలిసి జెడ్పీటీసీలు వచ్చారు. గౌరారంలో కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ ద్వారా హెచ్ఎండీఏ అనుమతి విషయమై చర్చించారు. ఇంతవరకు ఓకే.. కానీ వారితో వచ్చిన ఒకరికి కరోనా వైరస్ ఉంది అని తర్వాత తెలిసింది.
తెలంగాణలో కొత్తగా 209 కరోనా కేసులు.. మరో 9 మంది మృతి..
దీంతో కలెక్టర్, జెడ్పీటీసీలు ఉలిక్కిపడ్డారు. కలెక్టర్ వెంకట్రామారెడ్డి హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. జిల్లా అభివృద్ది పనుల పురోగతి, ఇతర అంశాలను కలెక్టర్ ఇంటినుంచే పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్లో సమస్యలకు సంబంధించి పత్రాలను వేయాలని కోరారు. అయితే దరఖాస్తుదారుడు విధిగా తమ ఫోన్ నంబర్ రాయాలని సూచించారు.
కంప్లైంట్ బాక్సుల్లో వేసిన ప్రతీ దరఖాస్తును పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పారు. సమస్యను సంబంధిత శాఖకు పంపించి నెల నుంచి 45 రోజుల్లో సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. లేదంటే ఫోన్ చేసి సమాధానం తెలియజేస్తారని తెలిపారు. కరోనా వైరస్ ప్రబలుతోన్న దృష్ట్యా.. ప్రజలంతా భౌతికదూరం పాటించాలని కోరారు. దూరంగా ఉంటూ.. శానిటైజర్తో ఎప్పటికప్పుడు చేతులు వాష్ చేసుకోవాలని సూచించారు.