సింగరేణిలో మరో ప్రమాదం: కళ్యాణిఖని ఓపెన్కాస్ట్లో పెల్లలు పడి అధికారి మృతి
ఆదిలాబాద్: సింగరేణిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కళ్యాణిఖని ఓపెన్ట్ కాస్ట్ గనిలో జరిగిన ప్రమాదంలో ఓ అధికారి మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగిన ప్రమాదంలో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న పురుషోత్తంపై బొగ్గు పెల్లలు పడటంతో తీవ్రగాయాలయ్యాయి.
రామకృష్ణాపూర్ సింగరేణి ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో పురుషోత్తం మరణించారు. ఘటనా స్థలాన్ని మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ తోపాటు అధికారులు పరిశీలించారు. పది రోజుల వ్యవధిలో మంచిర్యాల జిల్లా పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో వేర్వేరు ఘటనల్లో నాలుగు ప్రమాదం చోటు చేసుకున్నాయి.
నవంబర్ 10న శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3లో జరిగిన ప్రమాదంలో బండ కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్కే-5, ఆర్కే-6 గనుల్లో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలో బొగ్గు గనుల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, నవంబర్ 10న జరిగిన ప్రమాదంలో టింబర్మెన్ వి.కృష్ణారెడ్డి (57), బేర లక్ష్మయ్య (60) బదిలీ వర్కర్లు గాదం సత్యనారాయణరాజు (32) రెంకా చంద్రశేఖర్ మృతిచెందారు. మృతదేహాల వెలికితీత కోసం భూపాలపల్లి, రామగుండం, శ్రీరాంపూర్కు చెం దిన సింగరేణి రెస్క్యూ టీమ్ చర్యలు చేపట్టారు. భారీ శిథిలాలు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
Recommended Video
మృతుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ప్రాంతంలో ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని దాదాపు రూ.70 లక్షల నుంచి రూ. కోటి దాకా అందజేశామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. గనుల్లో తరుచుగా ప్రమాదాలు జరుగుతూ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.