తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీకి కీలక పదవి
Siricilla Rajaiah: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- తనకంటూ ఓ ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసుకుంటోన్నారు. అన్ని లోక్సభ స్థానాలను గెలుచుకునే దిశగా పావులు కదుపుతున్నారు.
శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న తప్పులను సరిదిద్దుతున్నారు.

ఈ క్రమంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యుడు సిరిసిల్ల రాజయ్యకు కీలక పదవిని అప్పగించారు. ఆయనను తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్గా నియమించారు. మరో ముగ్గురిని ఈ కమిషన్ సభ్యులుగా అపాయింట్ చేశారు.
ఎం రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్.. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ వస్తోన్నారు సిరిసిల్ల రాజయ్య. 2009 నాటి ఎన్నికల్లో వరంగల్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి, భారత్ రాష్ట్ర సమితికి చెందిన రామగళ్ల పరమేశ్వర్పై లక్షా 24 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
2014లో కూడా వరంగల్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వస్తోన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications