బావిలో ఆరు నెలల పసిపాప శవం: హత్య చేసి పడేశారా?
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని పాతబస్తి భవానీనగర్లో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ ఇంటిలోని బావిలో ఆరునెలల పసిపాప మృతదేహం లభ్యమైంది. కుటుంబ కలహాలతోనే పాపను కుటుంబీకులే హత్య చేసి బావిలో పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పసిపాప మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాలుడిపై పిచ్చికుక్కల దాడి
వరంగల్ జిల్లాలోని శాయంపేటలో పిచ్చికుక్కలు స్వైర్ విహారం చేశాయి. గురువారం ఉదయం మలవిసర్జనకు వెళ్లిన ఆరేళ్ల బాలుడు చరణ్పై ఐదు కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. బాలుడి శరీరంపై ఎనిమిది చోట్ల కుక్కలు కరిచినట్లు స్థానిక వైద్యలు తెలిపారు. బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
షోలాపూర్లో తప్పిపోయి..
మహారాష్ట్రలోని షోలాపూర్లో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులు వరంగల్ జిల్లా డోర్నకల్ రైల్వేస్టేషనుకు చేరుకున్నారు. అర్జున్, రాయ్లనే ఇద్దరు పిల్లలు తప్పిపోయి రావడంతో వారిని గుర్తించిన పోలీసులు చిల్డ్రన్స్ హోంకు తరలించారు. షోలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.