కేసీఆర్ కేసులపై ఇక్బాల్ నేతృత్వంలో సిట్: మత్తయ్య కేసులో మలుపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఏపీలో నమోదైన కేసుల దర్యాఫ్తుకు డీఐజీ ఇక్బాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం)ను ఏర్పాటు చేశారు.
దీని పైన ఈ రోజు సాయంత్రంలోగా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. సాయంత్రం సిట్ చీఫ్గా ఇక్బాల్ బాధ్యతలను స్వీకరించనున్నారు. గురువారం నుండి దర్యాఫ్తు చేపట్టనున్నారు.
కేసీఆర్తో డీజీపీ, ఏసీబీ డీజీ భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్తో డీజీపీ అనురాగ్ శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. మంగళవారం పలు దఫాలుగా సమావేశం అయిన అనంతరం అర్ధరాత్రి వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఆయన ఉదయం వస్తానని చెప్పారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు ఇచ్చారు.
టీడీపీ నేత కొత్తకోట దయాకర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేసు పెడితే, ఏవిధంగా ఎదుర్కోవాలనే దాని పైన చర్చ, ఫోన్ ట్యాపింగ్, ఇద్దరు నేతలుక నోటీసులు జారీ చేసిన అంశాలపై చర్చించారని తెలుస్తోంది.
ఏసీబీ ఎదుట వేం నరేందర్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి ఉదయం ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆయనను ప్రశ్నించనున్నారు.
కాగా, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆచూకీ లభించడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే క్వార్టర్లోని 208 క్వార్టరులో సండ్ర ఉంటున్నారు. ఏసీబీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో ఆయన లేరు.
ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో నోటీసు కాపీని కిటికీ ద్వారా క్వార్టర్ లోకి వేశారు. అనంతరం తాను విచారణకు సహకరిస్తానని చెప్పారు. కానీ ఉదయం వేం నరేందర్ రెడ్డి విచారణకు హాజరైనప్పటికీ, సండ్ర మాత్రం కనిపించలేదు.
మత్తయ్య కేసులో కీలకమలుపు
తెలంగాణ సీఎం కేసీఆర్ నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి కోసం స్టీఫెన్ సన్ నుండి రూ.కోటి తీసుకున్నారని, తనకు బెదిరింపులు వస్తున్నాయని మత్తయ్య విజయవాడ సత్యనారాయణ పురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో కీలక మలుపు! పోలీసులు మూడు రోజుల క్రితమే మత్తయ్య వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. తనకు ప్రాణహానీ ఉందని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించారు. మత్తయ్య కేసును సీఐడీ దర్యాఫ్తు చేస్తోంది.
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఏసీబీ అధికారులపై విజయవాడలో సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు స్కాంలో చంద్రబాబు పేరు చెప్పాలని తెలంగాణ ఏసీబీ అధికారులు, తెరాస నాయకులు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనకు, తన కుటుంబ సభ్యులకు ఏసీబీ అధికారులు, తెరాస నేతల నుంచి ప్రాణహాని ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మత్తయ్య కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఎపి ప్రభుత్వం కేసు దర్యాప్తు సీఐడీకి అప్పగించింది.
రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మత్తయ్యను, ఆయన కుటుంబ సభ్యుల్ని ఎవరెవరు బెదిరించారు? ఏమని బెదిరించారు? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరించిన వారెవరు? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటికే మత్తయ్యకు వచ్చిన ఫోన్కాల్ డేటా వివరాలనూ సేకరించారు.మత్తయ్య కేసీఆర్ పైన నేరుగా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. కేసీఆర్ తాలూకు మనుషులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారని సమాచారం.