పేపర్ లీకేజ్ అంశంలో ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకే సిట్.!విద్యార్థులకు అండగా దీక్షలన్న రేవంత్.!
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ కేసు విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవన్నారు తెలంగాణ పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే ప్రభుత్వం సిట్ ను ఉపయోగించుకుందని ఘాటు విమర్శలు చేసారు. ప్రతీ ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని సమాధానం ఇచ్చారని గుర్తు చేసారు.
త్వరలో నిరుద్యోగ దీక్షలు.. హాజరు కానున్న ప్రియాంక గాంధీ..
అంతే కాకుండా నిండు పార్లమెంటులోనే నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించారని రేవంత్ తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నాడని, బండి సంజయ్ మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు. ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? అని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

నిరుద్యగులను ప్రధాని మోసం చేసారు.. బండి సంజయ్ సమాదానం చెప్పాలన్న రేవంత్
ఇంటికో ఉద్యోగం అని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఒకే రోజు 2లక్షల ఉద్యోగాలని బండి సంజయ్ ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ వరంగల్ లో కాకుండా మోడీ ఇంటి దగ్గర చేసి ఉండి ఉంటే బాగుండేదని రేవంత్ రెడ్డి చమత్కరించారు. ఈ నెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపడతామన్నారు రేవంత్ రెడ్డి.

విద్యార్ధుల భవితకు అండగా ఉంటాం.. విద్యార్ధి, నిరుద్యోగులకు రేవంత్ భరోసా..
అంతే కాకుండా ఈ నెల 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు రేవంత్ రెడ్డి. మే 4 లేదా 5న సరూర్ నగర్ లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహించబోతున్నట్టు రేవంత్ వివరించారు. ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి, సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామన్నారు పీసిసి చీఫ్.
పాదయాత్ర ప్రారంభిస్తా.. జోగులాంబ జిల్లా నుంచి పాదయాత్ర ఉంటుందన్న రేవంత్..
ఇక ఇదే సభకు ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటారన్నారు రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ సొంత ప్రయోజనాల కోసం కాదని, నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటమని రేవంత్ స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ దీక్షలకు అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాలని రేవంత్ విజ్ఞప్తి చేసారు. మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుందని, జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications