పండగ సీజన్లో సికింద్రాబాద్- విశాఖ వందే భారత్పై ఆ నిర్ణయం: 1,128 సీట్లు
Vande Bharat express: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొంటోంది. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడుతోంది.
వందే భారత్ డిమాండ్..
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది. పండగ సీజన్లో ప్రయాణికుల తాకిడి అధికమైంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. కొత్త కొత్త మార్గాల్లో వాటిని నడిపిస్తోంది.

ధర అధికమే అయినప్పటికీ..
సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు. ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వీటి సంఖ్యను మరింత పెంచుతోంది.
కోచ్ల సంఖ్య పెంపు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీ, వారి నుంచి అందుతోన్న విజ్ఞప్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిస్తోన్న 20707/20708 వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్ల సంఖ్యను రెట్టింపు చేశారు. 20707 సర్వీస్కు 145 శాతం, 20708 సర్వీస్కు 159 శాతం మేర ఆక్యుపెన్సీ ఉంటోంది.
సీటింగ్ కెపాసిటీ పెంపు ఇలా..
ప్రస్తుతం నంబర్ 20707/20708 వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్ల సంఖ్య ఎనిమిది మాత్రమే. సీటింగ్ సామర్థ్యం 530. రద్దీ వల్ల దీన్ని రెట్టింపు చేశారు. కోచ్ల సంఖ్యను ఎనిమిది నుంచి 16కు పెంచారు. సీటింగ్ సామర్థ్యం 530 నుంచి 1,128కి పెరిగింది. ఇప్పటివరకు ఏడు చైర్ కార్, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉండే ఈ రైలులో ఇక 14 ఛైర్ కార్, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్లు అందుబాటులోకి రానున్నాయి.
13 నుంచి..
పెరిగిన కోచ్లతో కూడిన వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసు సోమవారం నుంచి అంటే ఈ నెల 13వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. దీనివల్ల ఇందులో ప్రయాణించే వారి సంఖ్యా రెట్టింపు అవుతుందని, మరింత మందిని ఒకేసారి వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి వీలవుతుందని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications