SCR: శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే..!
దక్షిణ మధ్య రైల్వే(SCR) ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. తాజాగా నవంబర్ 22, శుక్రవారం నాడు 35 పార్శిల్ కార్యాలయాలలో QR కోడ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, బీదర్, కాజీపేట, లింగంపల్లి, హైదరాబాద్ డివిజన్లోని కాచిగూడ, నిజామాబాద్లలో నగదు రహిత లావాదేవీలు జరపడానికి క్యూఆర్ కోడ్ పేమెంట్ తీసుకొచ్చింది.
విజయవాడ డివిజన్లో విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, సామర్లకోట, గుడివాడ, తెనాలి, గూడూరు, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, మచిలీపట్నం, నర్సాపూర్ క్యూఆర్ కోడ్ పేమెంట్ సౌకర్యం ఉంది. గుంతకల్ డివిజన్లోని కడప, అనంతపురం, రాయచూర్, ధర్మవరం, తిరుపతి, గుంతకల్, రేణిగుంట, ధోనే, చిత్తూరు, నంద్యాలలో, గుంటూరు డివిజన్లోని గుంటూరు క్యూఆర్ తో చెల్లింపులు చేయవచ్చు.

పార్సెల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (PMS) ఐటీ అప్లికేషన్ను ఉపయోగించడం ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు. QR కోడ్ డిస్ప్లే పరికరాలు పార్శిల్ కార్యాలయాల వద్ద ఇన్స్టాల్ చేశారు. నిర్దిష్ట QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులను ప్రారంభించడానికి PMS సిస్టమ్తో అనుసంధానించారు. ఈ సదుపాయం పార్శిల్ బుకింగ్ లావాదేవీని పూర్తి చేయడానికి పట్టే మొత్తం సమయాన్ని తగ్గిస్తుందని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ కుమార్ జైన్ తెలిపారు.
నగదు చెల్లింపులకు సంబంధించిన సమస్యలను నివారిస్తుందని పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు అవాంతరాలు లేని, సురక్షితమైన, సౌకర్యవంతమైన చెల్లింపు విధానం అని ఆయన వివరించారు. కాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. చాలా వరకు ట్రైన్లు సికింద్రబాద్ నుంచి కాకుండా చర్లపల్లి నుంచి నడవనున్నాయి.












Click it and Unblock the Notifications