సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే
దక్షిణ మధ్య రైల్వే గత ఆర్థిక సంవత్సరంలో రూ.20,339.36 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జోన్ ప్రారంభమైన తర్వాత ఇంత అత్యధిక ఆదాయాన్ని సంపాదించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2022-23లో రూ.18,976 కోట్లు రాగా ఈ ఏడాది దానిమీద ఏడు శాతం అధికంగా వచ్చింది. ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి రైల్వే తీసుకున్న చర్యలే ఇంత ఆదాయానికి కారణమయ్యాయి. రైళ్ల సంఖ్యను పెంచడం, అదనపు కోచ్ లు ఏర్పాటు చేయడం కూడా మరో కారణం.
117 రైళ్లల్లో 6921 అదనపు కోచ్ లు ఏర్పాటు చేశారు. దీనిద్వారా రూ.5731 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రయాణికుల రవాణాకు సంబంధించి 2023-24 సంవత్సరంలో 262.62 మిలియన్ల మంది ప్రయాణించారు. సరుకు రవాణా సేవలను పెంపొందించడం కోసం 6 కొత్త గతి శక్తి కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేశారు. లోడింగ్, అన్ లోడ్ ప్రక్రియ కోసం షెడ్లను బాగా పెంచారు. మౌలిక సదుపాయల కల్పనతోపాటు అవసరమైన మెరుగులద్దారు. వీటిద్వారా రవాణా చేసేందుకు వినియోగదాలు ఆసక్తి చూపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 141.12 మిలియన్ టన్నుల సరకు రవాణా లోడింగ్ జరిగింది.

టిక్కెట్ చెకింగ్ వల్ల వచ్చిన రాబడి కూడా కీలకంగా మారింది. 2023-24 సంవత్సరంలో జోన్ పరిధిలో టికెట్ తీసుకోకుండా ప్రయాణించేవారి నుంచి రూ. 512 కోట్ల ఆదాయం రాబట్టింది. 2022-23 సంవత్సరంలో నమోదైన రూ. 414.87 కోట్ల ఆదాయం కంటే ఈ ఏడాది వచ్చిన ఆదాయం ఎక్కువ. అధికారుల, సిబ్బందిపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రశంసలు కురిపించారు. ప్రయాణికుల ప్రయోజనాలను మెరుగుపరిచేందుకు మరింత మెరుగైన సేవలందిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే అనే కాకుండా దేశంలోని అన్ని రైల్వే జోన్లు, డివిజన్ల పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులపై రైల్వే కొరడా ఝుళిపించడంతో భారీగా ఆదాయం రైల్వేకు సమకూరుతోంది. కొన్నాళ్లు ఇదే ఒరవడిని కొనసాగిస్తే టికెట్ లేకుండా ప్రయాణించేవారి సంఖ్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications