Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు డెంజర్ బెల్స్.. సాగు నీరుకాదు.. తాగు నీరూ కష్టమే..!
ఈ సంవత్సరం కృష్ణా బేసిన్ లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండలేదు. దీంతో ఈ వేసవిలో సాగునీరుతో పాటు తాగు నీరు కటకటా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడుగంటుతోంది. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరిలోనే నీరు డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం నీరు డెడ్ స్టోరేజీకి అడుగు దూరంలో ఉంది. దీంతో ప్రాజెక్టును నమ్ముకుని పంటలు సాగు చేసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 819 అడుగులుగా ఉంది. ఇక నీటి నిల్వ విషయానికొస్తే 40 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నీటి నిల్వ 30 టీఎంసీలు. అంటే ప్రస్తుతం ఉన్న 40 టీఎంసీల్లో కేవలం 10 టీఎంసీలు మాత్రమే సాగు నీరుకు వాడుకోవాల్సి ఉంటుంది. అయితే వేసవిలో ఆవిరి రూపంలో నీరు రోజుకు 158 క్యూసెక్కులు వెళ్లిపోతాయి. ఇది దాదాపు ఐదు నెలలు కొనసాగుతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 19 మున్సిపాలిటీలు, మూడువేల గ్రామాల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. పక్క రాష్ట్రం ఏపీ ప్రభుత్వం తమ వాటా కోసం పోరాటం చేస్తోంది. ముచ్చుమర్రి నుంచి రోజు 960 క్యూసెక్కుల నీటిని తరలించుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సాగు నీటితో పాటు తాగునీటి గండం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం శ్రీశైలంలోకి 101 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది.
ఈ 101 టీఎంసీల్లో 21 టీఎంసీలతో జల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత టీఎస్ పవర్ జనరేషన్ స్టేషన్ ద్వారా సాగర్ కు వదిలారు. వానాకాలం సీజన్లో పంటల కోసం కేఎల్ఐ కింద 14 టీఎంసీలు, మిషన్ భగీరథకు 9 టీఎంసీలు కేటాయించారు. ఏపీ ప్రభుత్వం తన వాటా నీటిని వాడుకోగా ప్రస్తుతం నీటి నిల్వ40 టీఎంసీలకు తగ్గింది. కృష్ణానదికి అవతలి వైపు ఏపీ సర్కార్ టెలీమెట్రీలు ఏర్పాటు చేయకపోవడంతో సాగర్, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హెచ్ఎన్ఎస్ఎస్ద్వారా వాడుకున్న నీళ్లకు సరైన లెక్క లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications