TGSWREIS: ఆ 6200 మంది టీచర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS)లో 6200 మంది నాన్ రెగ్యులర్ స్టాఫ్, పార్ట్ టైమ్, అదనపు స్టాఫ్తో పాటు ఎవరైతే గౌరవ వేతనం పొందుతూ పనిచేస్తున్న టీచర్లను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఉద్యోగం కోల్పోయిన టీచర్లతోపాటు ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అంతేగాక, మంత్రుల నుంచి సీఎం వరకు వినతులు ఇచ్చారు.
మరోవైపు, ప్రతిపక్షాలు కూడా టీచర్ల తొలగింపును ఖండిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలోనే ఈ విద్యా సంస్థల్లో తొలగించిన టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆ టీచర్లను విధులకు రావాలని అధికారులు సూచించడంతో శుక్రవారం నుంచే తిరిగి విధుల్లో చేరారు.

ప్రభుత్వం తిరిగి తమను విధుల్లోకి తీసుకోవడం పట్ల నాన్ రెగ్యులర్ స్టాఫ్, పార్ట్ టైమ్, అదనపు స్టాఫ్తో పాటు ఎవరైతే గౌరవ వేతనం పొందుతూ పనిచేస్తున్న టీచర్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సంబంధిత అధికారుల నుంచి పిలుపురావడంతో శుక్రవారం నుంచే తిరిగి విధులకు హాజరవుతున్నారు.
కాగా, శుక్రవారం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) సీనియర్ అధికారులు ఆన్లైన్ జూమ్ సమావేశాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా సంబంధిత అధికారులు సంబంధిత సంస్థల్లో మంజూరైన పోస్టులలో పనిచేస్తున్న పార్ట్టైమ్ ఉపాధ్యాయుల సేవలను కొనసాగించడానికి అనుమతించారు.
'మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న పార్ట్టైమ్ ఉపాధ్యాయులు కొనసాగేందుకు అనుమతి ఉంది. అలాగే వృత్తి విద్యా ఉపాధ్యాయులు కూడా కొనసాగుతారు. ఇవి మౌఖిక సూచనలు, ఆర్డర్ కాపీ కోసం వేచి ఉన్నాం' అని ఒక ఉపాధ్యాయుడు చెప్పారు. అంతకుముందు, ఉపాధ్యాయ దినోత్సవానికి ముందు, గౌరవ వేతనం ప్రాతిపదికన సిబ్బందితో సహా పార్ట్టైమ్/అదనపు సిబ్బంది కేటగిరీలో పని చేసే రెగ్యులర్ కాని సిబ్బందిని తక్షణమే తొలగించాలని సొసైటీ దాని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. దీని ప్రభావం 6,200 మంది ఉపాధ్యాయులపై ఉంది.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగింపు లేఖలు జారీ చేసినందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత టీ హరీశ్ రావు మండిపడ్డారు. "ఇదేనా మీరు వాగ్దానం చేసిన ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన?" అని ప్రశ్నించారు. 6,200 మంది పార్ట్టైమ్ టీచర్లు, లెక్చరర్లు, డీఈఓలను విద్యా సంవత్సరం మధ్యలో తొలగించడంతో వేలాది మంది కుటుంబాలు కష్టాల్లో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు. ఎస్సీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ నుంచి 2,000 మంది టీచర్లను తొలగించడం రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలపై దాడి అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications