తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు జడ్జీలను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరగనుంది. కొత్తగా ఆరుగురిని జడ్జీలుగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫారసులో వెల్లడించింది.
సుప్రీంకోర్టు సిఫారసు చేసిన వారిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, నామవరపు రాజేశ్వరరావు, కాజా శరత్ , పుల్ల కార్తీక్, జగ్గన్నగారి శ్రీనివాసరావు పేర్లను సుప్రీం కొలీజియం సిఫారసు చేస్తున్నట్లు ప్రకటించింది.
వాస్తవంగా తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య 42 ఉండాలి. ప్రస్తుతం 29 మంది జడ్జీలు ఉన్నారు. అయితే, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం తర్వాత.. వీరంతా తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి న్యాయవ్యవస్థ బలోపేతానికి, జడ్జీల నియామకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
కాగా, ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చించారు. హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంచే విషయంపైనా చర్చకు వచ్చినట్లు సమాచారం.