'అన్ని సర్వేలు టీడీపీ-బీజేపీదే గెలుపని చెప్తున్నాయి'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు నిర్వహించిన అంతర్గత సర్వేలో బీజేపీ - టీడీపీ కూటమికే విజయావకాశాలున్నాయని తేలిందని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన తెరాస, గ్రేటర్ ఎన్నికల్లో గెలవలేదన్నారు.
అందుకే గ్రేటర్ ఎన్నికలను కాలాయాపన చేస్తోందని ఆరోపించారు. టీడీపీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవగలరా అని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ సవాల్ చేసారు. తెరాస ప్రభుత్వం క్రమంగా బంధువుల తెలంగాణగా మారిందని ఎద్దేవా చేశారు.
ఇద్దరు దళిత వ్యతిరేకులే: మందకృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా దళిత వ్యతిరేకులేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వేరుగా విమర్శించారు. తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులు దళితులను మోసం చేశారన్నారు. ఇద్దరు చంద్రులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు దళితులు సిద్ధం కావాలన్నారు.
చంద్రబాబు, కేసీఆర్లపై మావో జగన్ ఆగ్రహం
ఆలేరు, శేషాచలం ఎన్కౌంటర్లు బూటకమని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. అమాయక ఎర్రచందనం కూలీలను నరహంతక చంద్రబాబు పొట్టనపెట్టుకుంటే, సిమీ కార్యకర్తలను ఎన్కౌంటర్ చేయించిన నియంత కేసీఆర్ అన్నారు.