పెట్రోల్ బంకులో దారుణ హత్య... కత్తులతో పొడిచి పరార్... చంపింది బామ్మర్దులే...
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడి కత్తులతో పొడిచి చంపారు.ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.నిందితులు మృతుడి బామ్మర్దులుగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి 2013లో చివెంల మండలం ఐలపురం గ్రామానికి చెంది జలజతో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు.ఏడాది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కొన్నాళ్లుగా భార్య పుట్టింటి వద్దే ఉంటోంది. అయినప్పటికీ ఇద్దరూ ఫోన్లోనూ గొడవపడుతున్నారు. రోజు ఫోన్ చేసుకుని తిట్టుకుంటున్నారు.
బాలకృష్ణ నెమ్మికల్ సమీపంలోని ఎస్సార్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున బాలకృష్ణ పెట్రోల్ బంకులో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో... ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. అతనితో గొడవపడి దాడికి పాల్పడ్డారు. కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.బంకులో పనిచేస్తున్న ఇతర సిబ్బంది చూస్తుండగానే ఈ హత్య చోటు చేసుకుంది.
వెంటనే బంక్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి బామ్మర్దులు మేడెబోయిన అంజయ్య,మహేష్, స్నేహితుడు లింగయ్యతో కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
నవ వధువు దారుణ హత్య :
హైదరాబాద్ ప్రగతినగర్లో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను గొంతుకోసి హతమార్చాడు. పెళ్లయిన నెల రోజులకే ఆ నవ వధువు హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఆమెపై అనుమానంతోనే భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. నిందితుడి పేరు గంగాధర్... కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్కి చెందిన అతనికి అదే జిల్లాకు చెందిన సుధారాణితో గత నెల 27న వివాహం జరిగింది. వివాహ సమయంలో భారీగా కట్న కానుకలు ముట్టాయి.
ప్రస్తుతం ఈ కొత్త జంట హైదరాబాద్ ప్రగతినగర్లోని ఓ అపార్ట్మెంటులో నివాసముంటున్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త మానసికంగా,శారరీకంగా వేధించడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పుకుంది.అయితే వారు సర్దుకుపోవాలని చెప్పడంతో ఏమీ చేయలేకపోయింది. ఇదే క్రమంలో శనివారం ఆమెను చూసేందుకు తల్లిదండ్రులు హైదరాబాద్లోని వారి ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపు కొట్టగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. దాదాపు 3గంటలు వేచి చూశాక పోలీసులకు సమాచారమిచ్చారు. లోపలికి వెళ్లి చూడగా సుధారాణి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది.సుధారాణి గొంతు కోసి హత్య చేసిన ఆమె భర్త తన చేయి,గొంతు కూడా కోసుకున్నాడు.ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.పెళ్లయిన నెల రోజులకు అల్లుడి చేతిలోనే బిడ్డ హత్యకు గురవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన సుధారాణి కుటుంబ సభ్యులు,బంధువులు కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.