సింగపూర్లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి
సింగపూర్ దేశంలో తెలంగాణకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ శుక్రవారం రాత్రి సింగపూర్ బీచ్లో ప్రాణాలు కోల్పోయాడు. గత ఏడాదిన్నరగా సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పవన్.. శుక్రవారం బీచ్లో శవమై తేలాడు.
అయితే, మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీచ్లో పవన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పాస్పోర్ట్ సహాయంతో తోటి మిత్రులను విచారిస్తున్నారు. ఒక్కడే వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా అతడ్ని చంపేశారా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి శ్రీనివాసరావు కోదాడలో పల్లినూనె వ్యాపారం చేస్తుండగా.. పెద్ద కుమారుడు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా, రెండు నెలల్లో మృతుడు పవన్ అమెరికాకు వెళ్లిపోవాల్సిన సమయంలో ఇలా జరగడంతో అతని తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని త్వరగా ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పవన్ మృతితో అతని కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో అమెరికా, ఆస్ట్రేలియాలో భారతదేశానికి చెందిన పలువురు వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రమాదాలు, దాడుల్లో మృతి చెందారు.












Click it and Unblock the Notifications