మద్యం మత్తులో డ్రైవర్: తల్లితో సహా ఐదుగురు కూతుళ్లు బలి(పిక్చర్స్)
మెదక్/నిజామాబాద్: మెదక్ జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన జంగం రాజమణి, తన ఐదుగురు పదేళ్ల లోపు కుమార్తెలు, తమ్ముడు నవీన్తో కలిసి వైద్యం కోసం శనివారం పిట్లం మండల కేంద్రానికి కారులో బయలుదేరారు. కారేగాం సమీపంలో పిల్లివాగు వంతెన పై నుండి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, అక్కడ ఉన్న ప్రజలు వెళ్లవద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో డ్రైవర్ ఇస్మాయిల్ తాగిన మత్తులో నిర్లక్ష్యంగా కారును ముందుకు తీసుకెళ్లడంతో ప్రజల కళ్లెదుటే కారు వాగులో కొట్టుకుపోయింది.
కారు ముందు భాగంలో ఉన్న డ్రైవర్ ఇస్మాయిల్, రాజమణి తమ్ముడు నవీన్లు కారు డోరు తెరుచుకుని స్థానికుల సహాయంతో అతికష్టం మీద ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే కారు వెనుక భాగంలో కూర్చున్న రాజమణి, ఆమె ఐదుగురు కుమార్తెలు అందులోనే చిక్కుబడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒంటరైన కుటుంబ పెద్ద రాజు ఒంటరిగా మిగిలిపోయి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, కొట్టుకుపోయిన కారును కంగ్టి ఎస్సై నానునాయక్, మండల ప్రత్యేక అధికారి రాంరెడ్డి.. సిబ్బంది సాయంతో వెలికితీశారు.

కుటుంబాన్ని మింగిన వరద
పదేళ్లుగా విద్యుత్తు శాఖలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న తడ్కల్కు చెందిన రాజు (34)కు పదేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన రాజమణితో వివాహం అయ్యింది. వారికి తొలి కాన్పులో ప్రియ జన్మించింది.

వరదలో కొట్టుకుపోతున్న కారు
అనంతరం మగ సంతానం పుడతారనే ఆశతో ఉన్న ఈ దంపతులకు వరుసగా అమ్మాయిలే పుట్టారు. రెండో సంతానంలో సైతం జ్యోతి పుట్టింది. తరువాత మూడో కాన్పులో కవల అమ్మాయిలు. పదమూడు నెలల క్రితం దీపాంక్ష పుట్టింది. కాగా, ఈ ఐదుగురు అమ్మాయిలతో ఆనందంగా జీవితం సాగిస్తున్నారు దంపతులు. నెల క్రితమే దీపాంక్ష పుట్టిన రోజు వేడుకలు చేశారు.

రాజమణి మృతదేహం
తడ్కల్ విద్యుత్తు ఉపకేంద్రంలో పనిచేసే రాజు ఏడాది క్రితం రేగోడుకు బదిలీ అయ్యారు. శనివారం విధులకు హాజరయ్యారు. వర్షాలు బాగా కురవడంతో అంతరాయం ఏర్పడ్డ విద్యుత్తు సరఫరా పునరుద్ధరణలో నిమజ్ఞమయ్యారు. ఇంతలోనే చిన్న పాప దీపాంక్షకు బాగా లేదని భార్య రాజమణి ఫోన్ చేసింది.

చిన్నారులు, రాజమణి మృతదేహాలు
ఎవరైనా డ్రైవర్ అందుబాటులో ఉంటే పిట్లం ఆస్పత్రికి వెళ్లండని, ఒక్కరే కాకుండా పిల్లలు అందరినీ, బావమరిది నవీన్ను సైతం వెంట తీసుకుని వెళ్లాలని రాజు సూచించారు. దీంతో రాజమణి ఐగురు పిల్లలతో కలిసి కారులో వెనక సీటులో కూర్చోగా డ్రైవర్ ఇస్మాయిల్ వాహనం నడిపిస్తున్నాడు. నవీన్ సైతం ముందు సీటులో కూర్చున్నారు.

రాజు కుటుంబం(ఫైల్)
మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తడ్కల్ నుంచి బయలు దేరారు. గోద్మెగాం గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించగానే వాగులోకి వెళ్లింది.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఎంతో అన్నోన్యంగా ఉండే భార్యా పిల్లలు వరదలో కొట్టుకుపోయారు అన్న విషయం తెలుసుకున్న రాజు క్షణం ఆగకుండా ఘటనా స్థలానికి చేరుకున్నాడు. చేసేది ఏమీ లేక బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. రాజు తండ్రి శంకర్ పదేళ్ల క్రితమే చనిపోగా, తల్లి లచ్చవ్వ (65) రాజుతో కలిసి ఉంటోంది.












Click it and Unblock the Notifications