ఖమ్మం మినహా ఎక్కడా కనిపించని టీడిపి..!!పోస్ట్మార్టం మొదలు పెట్టిన తెలుగు తమ్ముళ్లు..!
హైదరాబాద్ : ప్రస్తుతం పార్టీ ఓటమి పై సమీక్ష నిర్వహించే పనిలో పడ్డారు తెలుగుతమ్ముళ్లు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడిపి రెండు స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని చెప్పిన టీడిపి, 13 స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావు పేట నుంచి మచ్చా నాగేశ్వర రావు లు గెలిచారు. అంటే గెలిచిన రెండు సీట్లు ఖమ్మం జిల్లాలోనే దాంతో ఆ జిల్లా వరకే టీడిపి పరిమితం అయిపోయింది. వాస్తవానికి టీడిపికి ఇంత కాలం సెటిలర్లు బలం అనుకున్నారు కాని హైదరాబాద్ , రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న సెటిలర్లు సైతం టీఆర్ఎస్ కే జై కొట్టారు. దాంతో హైదరాబాద్ లో ప్రాతినిద్యం లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో 72 స్థానాల్లో పోటీ చేసిన టీడిపి 15 స్థానాల్లో గెలిచింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో తన బలాన్ని నిరూపించుకుంది టీడిపి. కాని ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం టీడిపి ఘోరంగా చతికిల పడింది. ప్రజాకూటమి పేరుతో ప్రజల్లోకి వెళ్ళినా టీడిపికి పెద్దగా కలిసి రాలేదు.
13 స్థానాల్లో మాత్రమే పోటీ చేసినా, 11 స్థానాల్లో ఓటమి పాలయింది టీడిపి. ముఖ్యంగా టీడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూకట్ పల్లి స్థానంలో సైతం నందమూరి సుహాసినిని గెలిపించుకోలేక పోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా తప్ప మరెక్కడా తెలుగుదేశం జెండా ఎగుర వేయలేక పోయారు. దాంతో పార్టీ ఓటమికి గల కారణాలపై పోస్ట్ మార్టం చేసే పనిలో పడింది. వాస్తవానికి ఏపీ సిఎం చంద్రబాబు తో పాటు బాలకృష్ణ, ఏపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారం చేశారు. ముఖ్యంగా కూకట్ పల్లిలో సెటిలర్లను ఆకర్షించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు.
అయితే ఈ ఫలితాలను సమీక్షించుకుని వచ్చే పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్దం అవుతాం అంటున్నారు టీటీడిపి అధ్యక్షుడు ఎల్ రమణ. ఆలస్యంగా సీట్లు కేటాయించటమే కాకుండా, పోల్ మేనేజ్మెంట్ సైతం సరిగ్గా జరగని కారణంగా టీడిపి ఓడిపోయిందని చెప్తున్నారు నేతలు. అంతేకాదు ప్రజల్లోకి కూటమి లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లలేక పోవటం, మరోపక్క భాగస్వామ్య పార్టీ ల మధ్య ఓట్లు బదలాయింపు కాలేదని అభిప్రాయాన్ని టీడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.