20లక్షల కోట్ల లెక్కేది: కెసిఆర్పై విరుచుకుపడిన రేవంత్
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని.. అధికార టిఆర్ఎస్ పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు.
మెదక్ జిల్లా ఆర్సీపురంలో మెదక్ జిల్లా టిడిపి అధ్యక్షురాలు శశికళా యాదవరెడ్డి నేతృత్వంలో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి కేంద్ర కమిటీ సభ్యుడు రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు చేసిన 20 లక్షల కోట్ల రూపాయలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉందని రేవంత్రెడ్డి అన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ వాలిపోయి వరాలు కురిపిస్తారని.. ఎన్నికల తర్వాత హమీలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని చెబుతున్న కేసీఆర్ నగరంలో 20 నిమిషాలపాటు గాలివానతో ప్రజలు ఇబ్బందులు పడితే ఇప్పటి వరకు సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని ఆరోపించారు.