మాకు చెప్పలేదు: కేసీఆర్కు కేంద్రం ఝలక్, బాబుకు అవకాశం
న్యూఢిల్లీ: ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలసంఘం తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాకిచ్చింది. పాలమూరు - రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల సాంకేతిక అనుమతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలనూ తమకు అందచేయలేదని కేంద్ర జలసంఘం పేర్కొంది.
నీటి వనరుల అంచనా, వినియోగం తదితర వివరాలతో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల వివరాలు ఏవీ కేంద్ర జలసంఘం వద్ద కానీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్ద కానీ, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వద్ద కానీ లేవని సుప్రీం కోర్టుకు నివేదించింది.
విభజన నిప్పు నీళ్ల వల్లే: తర్వాతా అదే వివాదం
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు - రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల వల్ల తమకు నష్టం కలుగుతుందని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ ఏపీకి చెందిన ఆళ్ల వెంకట గోపాల కృష్ణ రావు, మరికొందరు రైతులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించగా, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తరఫున కేంద్ర జలసంఘం ఈ మేరకు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. ఇప్పటికే, ప్రాజెక్టుల విషయంలో కెసిఆర్, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కాగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ, జలసంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్ద ఈ ప్రాజెక్టుల నీటి వనరుల అంచనా, వినియోగానికి సంబంధించి ప్రతిపాదన ఏదీ లేదని, తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలనూ సాంకేతిక అనుమతి కోసం బోర్డుకు సమర్పించలేదని పేర్కొన్నారు.
వాటిని ఇవ్వాలని కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి సూచించిందని, ఈ రెండు ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో పేర్కొనలేదన్నారు.
పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిలోని ప్రాజెక్టులను నోటిఫై చేయడమే కేంద్రం పరిధి అని, ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సిన అవసరం లేదని ప్రమాణ పత్రంలో పేర్కొంది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాలని, కానీ తెలంగాణ దానిని సమర్పించలేదని తెలిపింది.