రేవంత్ ఇష్యూ: సభలో గందరగోళం, చర్యకు కేసీఆర్
హైదరాబాద్: డీఎల్ఎఫ్ భూముల పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాసన సభలో వివరణ ఇచ్చారు. అనంతరం తెలంగాణ టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా, పక్క రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలన్నారు.
ఈ సభ్యుడు చేసిన చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. సీఎం చూపించే పేపర్ తప్పు అని కొందరు సభ్యులు చెబుతున్నారని, ఈ సభ్యుడు చూపిన దానిని ఏపీ ఉపయోగించుకునే అవకాశముందన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ క్షమాపణలు చెప్పాకనే మాట్లాడాలన్నారు.

కాగా, అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ.. సభలో సంస్కారం మరిచి వ్వవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి సూచించారు. మైహోమ్ భూముల వ్యవహారంలో విపక్షాల సభ్యులు మాట్లాడిన తీరు బాగాలేదన్న ఆయన సదరు సభ్యులను బయటకు పంపాలని కోరారు.
మైహోం వ్యవహారంలో కేటాయింపులు, పనుల ప్రారంభం మొత్తం కూడా రాష్ట్ర విభజనకు ముందే జరిగిందని, ఈ విషయంలో తెలంగాణ టీడీపీ సభ్యులు చేస్తున్న ఆరోపణలు సవ్యంగా లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ అరగంట వాయిదా
కాగా, కేసీఆర్ వివరణ పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడేందుకు సిద్ధమైనప్పుడు.. క్షమాపణలు చెప్పాకనే మాట్లాడాలని మంత్రులు సూచించారు. ఈ దశలో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభాపతి సభను అరగంట పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications