తెలంగాణ శాసనసభా పర్వం: 22Aపై చర్చకు సభలో బీజేపీ రచ్చ.. స్పీకర్ ఆగ్రహం!
తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. సభను సజావుగా నడపాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టటం కోసం బీఆర్ఎస్, బీజేపీ రంగంలోకి దిగాయి. సభాపర్వం మొదటి రోజే సభలో ఉద్రిక్తత నెలకొంది. 22A అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో అసెంబ్లీలోకి ప్రవేశించారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో బీజేపీ ప్లకార్డులు.. స్పీకర్ ఆగ్రహం
అసెంబ్లీ లోపల ప్లకార్డులు ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని, గతంలోనే ఇలా చేయవద్దని చెప్పామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. ప్లకార్డులను మార్షల్స్కు అప్పగించాలని, లేకుంటే బలవంతంగా బయటకు పంపిస్తామని హెచ్చరించారు. 22Aపై చర్చించే అంశంపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై చర్చిద్దామని, అయితే సభ సజావుగా జరగాలంటే ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.

22Aపై చర్చకు మంత్రి సరే అన్నా ఆగని నిరసన
శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా 22Aపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకారం అందించాలని కోరారు. అయినప్పటికీ బీజేపీ సభ్యులు శాంతించలేదు. ప్లకార్డులతో స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నల్ల దుస్తులతో నిరసన
మరోవైపు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యమని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నలుపు రంగు టీ-షర్టులు, నల్ల చీరలు ధరించి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తన చీరను లాగి అవమానించారని బోరున ఏడ్చారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం.. రచ్చ
అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మహిళా ఎమ్మెల్యేలపై ఇలా ప్రవర్తించడం సంస్కృతి కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల దుస్తులు ధరించి వస్తే తప్పేమిటని ప్రశ్నించారు.బీఆర్ఎస్ సభ్యులు నెల రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని, అన్ని అంశాలపై చర్చ జరిగేలా స్పీకర్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొదటి రోజే రెండు ప్రతిపక్షాల నిరసనలతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.














Click it and Unblock the Notifications
