వేదికపై భావోద్వేగానికి లోనైన స్పీకర్ పోచారం... తల్లిని గుర్తుచేసుకుంటూ కంటతడి....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓ కార్యక్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. తన మాతృమూర్తిని గుర్తు తెచ్చుకుని కంటతడి పెట్టుకున్నారు. తన తల్లి ఇచ్చిన స్పూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కార్యక్రమంలో స్త్రీ మూర్తుల గొప్పదనాన్ని కొనియాడే పాటలను ప్లే చేయడంతో... వేదికపై ఉన్న పోచారం ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్కసారిగా దు:ఖం పొంగుకురాగా రెండు చేతులు ముఖానికి అడ్డుపెట్టుకుని ఆయన దు:ఖించారు. ఈ సందర్భంగా పక్కన ఉన్నవారు ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం పోచారం మాట్లాడుతూ... తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తుచేసుకున్నారు.
102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని... ఆమె ఇచ్చిన స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన భార్య పుష్పమ్మ అందించిన తోడ్పాటు కూడా మరువలేనిది అన్నారు. ఈ ఇద్దరు స్త్రీ మూర్తుల వల్లే తాను ప్రజా జీవితంలో విజయం సాధించానన్నారు.
సోమవారం(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.సోమాజిగూడలోని పార్క్ హోటల్లో దళిత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏడాది పొడవునా ప్రతీ రంగంలో మహిళలకు ప్రాధాన్యత దక్కాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. మహిళలు ఆర్థికంగా బలపడాలని... టీ ప్రైడ్ ద్వారా దళిత మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు దళిత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చేయూతనిస్తోందని తెలిపారు. తెలంగాణ సమాజానికి చేస్తున్న ఆ సంస్థ చేస్తున్న సేవలకు అభినందనలు తెలిపారు.